వన్డే ప్రపంచ కప్ లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియా ఆట తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొన్నటికి మొన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 199 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత ఇండియాని మొదట్లో కట్టడి చేసినా తర్వాత చేతులెత్తేసింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో లక్నోలో జరిగిన మ్యాచ్ లో అంతకన్నా ఘోరంగా ఆడటం చూసి అభిమానులు డంగైపోతున్నారు. ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్ గా ఉన్న జట్టేనా? ఇది? అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఒకదశలో 70 రన్స్ కి 6 వికెట్లు పడిపోయాయి. మొదటి నుంచి ఒకదాని వెంట ఒకటి వికెట్లు పడుతున్నా మహామహులు అందరూ తలవంచుకు వెళ్లిపోయారు. మాక్స్ వెల్ అయితే 17 బాల్స్ ఆడి మూడు రన్స్ మాత్రమే చేశారు. ఎంత డిఫెన్స్ ఆడినా ఔట్ కావడం చూసి ఒక క్షణం నిశ్చేష్టుడైపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేనట్టుగా వికెట్ దగ్గరే అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఓపెనర్లు వార్నర్ (!3) , మిచెల్ మార్ష్ (7), స్టీవ్ స్మిత్ (19), జోష్ ఇంగ్లిస్ (5), మార్కస్ స్టోయినిస్ (5) మాక్స్ వెల్ (3) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవెలియన్ బాట పట్టారు.
భారత్-ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పిచ్ టర్న్ అయినట్టు కూడా లక్నోలో లేదు. ఇదే పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరగ్గొటి పారేశారు. 50 ఓవర్లలో 311 పరుగులు చేసి వదిలారు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ పై ఆస్ట్రేలియా జూలు విదుల్చుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇంట్లో ఏదో అర్జెంటు పని ఉన్నట్టు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న ఏమిటంటే…అసలు ఆసిస్ కి ఏమైంది? గెలుద్దామని వచ్చారా? లేదా? అని అప్పుడే కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంకా సినిమా అయిపోలేదని ఇండియాతో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. అయితే ఇప్పటికి రెండు సినిమాలు అయిపోయాయి. మరి మూడో సినిమా అంటే మూడో మ్యాచ్ అయినా బ్లాక్ బ్లస్టర్ చేస్తారో లేదో చూడాల్సిందే.