Asia Cup : ఆసియా కప్ ఫైనల్ లో భారత్ బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు తొలి ఓవర్ 3వ బంతికే బుమ్రా షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ పెరీరా (0) ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 ఓవర్ లో 4 వికెట్లు నేలకూల్చి లంకను వారి సొంత గడ్డపై బెంబేలెత్తించాడు.
నాలుగో ఓవర్ తొలి బంతికి నిస్సాంక (2) జడేజా క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 3,4 బంతుల్లో సదీర సమరవిక్రమ (0), అసలంక (0)ను పెవిలియన్ కు పంపాడు. ఆ ఓవర్ చివరి బంతికి ధనుంజయ డిసిల్వా (4) అవుట్ కావడంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అదే స్కోర్ వద్ద కెప్టెన్ శనక (0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు.
శ్రీలంక స్కోర్ 33 పరుగుల వద్ద సిరాజ్ మరోసారి దెబ్బకొట్టాడు. చాలాసేపు ఒంటరి పోరాటం చేసిన కుశాల్ మెండిస్ (17) 7వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. దునిత్ వెల్లలాగే( 13)ను హార్థిక్ పాండ్యా అవుట్ చేయడంతో 40 పరుగులకు లంక 8 వికెట్లు కోల్పోయింది. చివరి రెండు వికెట్లు ప్రమోద్ ముధుశాన్ (1), మతీశ పతిరన ( 0)ను కూడా హార్ధిక్ పాండ్యానే పడగొట్టాడు. దీంతో శ్రీలంక 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ కు 6 వికెట్లు, పాండ్యాకు 3 వికెట్లు, బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి.
శ్రీలంక జట్టులో 5 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇద్దరు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు.