Ashwin : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అశ్విన్ సత్తాచాటాడు. ప్రపంచ నంబర్వన్ బౌలర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ కు భారత్ తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ మ్యాచ్ లో ఆడనప్పటికీ ఈ మేటి స్పిన్నర్ తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.
టెస్టు బౌలర్ల జాబితాలో కమిన్స్, రబాడ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. జడేజా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ బుమ్రా రెండు ర్యాంకులు కోల్పోయాడు. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా చివరగా 2022 జులైలో టెస్టు మ్యాచ్ ఆడాడు. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలి 3 స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లే ఉన్నారు. మార్నస్ లబుషేన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో స్టివ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుతంగా ఆడిన రహానె 37వ స్థానానికి చేరుకున్నాడు. భారత్ ఆడిన గత 5 టెస్టుల్లోనూ లేకపోయినా రిషబ్ పంత్ భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకు బ్యాటర్గా నిలిచాడు. పంత్ పదో ర్యాంకులో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానం, విరాట్ కోహ్లి 13వ స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా కు నంబర్వన్ ఆల్రౌండర్ స్థానం దక్కింది.