టీమ్ ఇండియాతో జరగనున్న ఇంగ్లాండ్ తొలి టెస్ట్ నేడు హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియం అన్ని హంగులతో ముస్తాబైంది. టెస్ట్ మ్యాచ్ కి కూడా పూర్వ వైభవం తీసుకువచ్చే దిశలో హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్నిరకాల ప్రయత్నాలు చేసింది.
ఎప్పటిలాగే ఇంగ్లాండ్ కానివ్వండి, విదేశీ జట్లు కానివ్వండి, భారత్ లో పర్యటించినప్పుడు పేసర్లతో దాడి చేస్తుంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల తో వస్తారు. ఇన్నేళ్లుగా ఇలాగే జరుగుతోంది.
కానీ ఈసారి ఇంగ్లాండ్ జట్టు కంప్లీట్ ఆపోజిట్ డైరక్షన్ లో వెళుతోంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల తో బరిలోకి దిగుతోంది. ఒక పేసర్ తోనే దిగి, అదనంగా బ్యాటర్ ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముల్లుని ముల్లుతోనే తీయాలనే సంకల్పంతో స్పిన్నర్లతో ఎదురుదాడి చేయాలని చూస్తోంది. ముఖ్యంగా టీమ్ ఇండియా సంప్రదాయ వ్యూహం ఇది.. ఎన్నో ఏళ్ల నుంచి భారత్ లో సిరీస్ జరిగితే టీమ్ ఇండియాలో కూడా ముగ్గురు స్పిన్నర్లు ఉండేవారు.
వెంకటపతి రాజు, అనిల్ కుంబ్లే, రాజేష్ చౌహాన్ ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉండేది. తర్వాత రాజేష్ చౌహాన్ ప్లేస్ లో హర్భజన్ వచ్చాడు.. ఇలా కాంబినేషన్స్ మారేవి.. కానీ ముగ్గురు మాత్రం ఉండేవారు.
ఇంకా పాతరోజుల్లోకి వెళితే.. బిషన్ సింగ్ బేడీ, ప్రసన్న, వెంకట రాఘవన్, చంద్రశేఖర్ ఇలా చాలామంది ప్రముఖ స్పిన్ బౌలర్లు ఉండేవారు. కాల చక్రం మారింది. టీమ్ ఇండియా కూడా స్పిన్నర్లకు నెమ్మదిగా ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తోంది. ఆల్ రౌండర్లను పెంచుతోంది.
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తరహాలో ఆడేవారికి ప్రాధాన్యత ఇస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒకరినే తీసుకుంటోంది. కానీ ఇప్పుడు టీమ్ ఇండియా కూడా కనీసం ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం రవీంద్ర జడేజా (ఆల్ రౌండర్), అశ్విన్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. ఇక మూడో స్పిన్నర్ గా అక్షర్ పటేల్ (ఆల్ రౌండర్) లేదా కులదీప్ యాదవ్ మధ్య పోటీ గట్టిగా ఉంది.
ఈ క్రమంలో బ్యాటింగ్ చేయగల సమర్థుడు కాబట్టి అక్షర్ పటేల్ ని తీసుకోవచ్చు. 12 టెస్టుల్లో 50 వికెట్లు తీసిన అక్షర్ వైపు టీమ్ ఇండియా మొగ్గు చూపించవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే ఇద్దరు ఆల్ రౌండర్లను పక్కన పెడితే, స్పెషలిస్ట్ స్పిన్నర్ అశ్విన్ ఒక్కడే కనిపిస్తున్నాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఆడాలంటే ఇంగ్లాండ్ తో సిరీస్ చాలా కీలకం. ప్రస్తుతం భారత్ 2 స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 7 స్థానంలో ఉంది.
ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఎదురు వ్యూహంతో రావడంతో టీమ్ ఇండియా ఎలా ఎదుర్కొంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లో ఒటమి అనేదే ఎరుగని టీమ్ ఇండియా మరి సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా? లేదా అనేది వేచి చూడాలి.
టీమ్ ఇండియాలో కొహ్లీ లాగే, ఇంగ్లాండ్ జట్టు నుంచి కూడా కీలకమైన ఆటగాడు హ్యారీ బ్రూక్.. వ్యక్తిగత కారణాలతో లండన్ వెళ్లిపోయాడు. దీంతో ఆ జట్టు కూడా సమతూకం దెబ్బతిని అవస్థలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే
హైదరాబాద్కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విరాట్ కొహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో కొత్త ఆటగాడిని తీసుకోవడం టీమ్ మేనేజ్మెంట్ కి సవాల్ గా మారింది. తర్వాత మూడు టెస్ట్ లకు వస్తాడా? రాడా? అనేది కూడా డౌట్ గా ఉందని అంటున్నారు. అందుకే రింకూ సింగ్ ని రెడీ చేస్తున్నారని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి.