Nitish Kumar Reddy : టీమ్ ఇండియాలో ఆల్ రౌండర్ల కొరత పట్టి పీడిస్తోంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు కూడా మ్యాచ్ లో తేలిపోతే, రెగ్యులర్ బౌలర్లకు భిన్నంగా బౌలింగ్ వేసే ఒకరు కావాలి.. అంతేకాదు ఒక పేసర్ కి లయ దొరక్కపోయినా, అతన్ని ప్రత్యర్థులు చితక్కొడుతున్నా, అతని కోటాను వేసే మరో ప్రత్యామ్నాయ బౌలర్ కావాలి. అందుకే ప్రతీ జట్టులో ఒక ఆల్ రౌండర్ ని పెట్టుకుంటారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటా జట్టుకి ఉపయోగపడేలా చూసుకుంటారు.
ఇప్పుడు టీమ్ ఇండియాలో హార్దిక్ పాండ్యాలేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు కపిల్ దేవ్ ఉండేవాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ధోనీ వచ్చి, ఆ రెండింటి లోటు భర్తీ చేశాడు. కానీ బౌలర్ కమ్ బ్యాటర్ గా రావడానికి హార్దిక్ పాండ్యా రావల్సి వచ్చింది. కానీ పాండ్యా తరచూ గాయాల పాలు కావడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది.
ఈ క్రమంలో సరైన ఆల్ రౌండర్ కోసం బీసీసీఐ అన్వేషిస్తుంటే.. ఒక 20 ఏళ్ల తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వారి కంట పడ్డాడు. అండర్-16 సీజన్లో 1200కిపైగా పరుగులు చేశాడు. తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ చేశాడు. నాగాలాండ్పై 441 పరుగులు చేసి పారేశాడు. హైదరాబాద్ పై 190 పరుగులు చేశాడు. ఇలా నితీశ్ అప్పుడే బీసీసీఐ దృష్టిలో పడ్డాడు.
2017-18 సీజన్ లో అండర్-16 విభాగంలో దేశంలోనే బెస్ట్ క్రికెటర్కు ఇచ్చే జగన్మోహన్ దాల్మియా అవార్డును నితీశ్కు ఇచ్చింది. ఆంధ్రా క్రికెట్ సంఘం తరఫున ఈ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ గా నితీశ్ నిలిచాడు.
ఇప్పుడిదంతా ఎందుకంటే రంజీ ట్రోఫీలో ముంబై-ఆంధ్రా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడే నితీశ్ పేరు మళ్లీ మార్మోగింది. ఎందుకంటే తను అంతర్జాతీయ ఆటగాళ్లయిన ఆజ్యింక రహానే, శ్రేయాస్ అయ్యర్ వికెట్లను తీశాడు. వీరితో పాటు ఓపెనర్ జై బిస్టాను అవుట్ చేశాడు. అలా తనపై మళ్లీ అందరి ఫోకస్ పడింది
ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున నితీశ్ ఆడుతున్నాడు. ఆ జట్టులోనే ఉన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్ దగ్గర్నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకున్నానని చెబుతున్నాడు.
నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి…కొడుకులోని క్రికెట్ టెక్నిక్ ని పట్టాడు. తనని క్రికెటర్ గా చేయాలని హిందుస్తాన్ జింక్ లో బ్రహ్మండమైన ఉద్యోగాన్ని వదిలేశాడు. అలా 12 ఏళ్ల వయసులో ఉదయపూర్ నుంచి వైజాగ్ వచ్చి క్రికెట్ లో శిక్షణ ఇప్పించాడు. అన్నీ కుదిరితే రేపు టీ 20 వరల్డ్ కప్ సమయాని నితీశ్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా పండితులు జోస్యం చెబుతున్నారు.