ICC World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ కోసం 140 కోట్ల మంది భారతీయులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూశారు. అలాంటి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఊహించని విధంగా ఓటమి పాలయ్యింది. దీంతో ఆస్ట్రేలియా ప్రపంచకప్ ని ఎగరేసుకుపోయింది. ఇంతవరకు అందరికీ తెలిసిన కథే…
కానీ ఇక్కడే ఆసిస్ క్రికెటర్ మార్ష్…బలుపుతో ఒక పని చేశాడు. అదేమిటంటే సోఫాలో కూర్చుని బీర్ తాగుతూ వరల్డ్ కప్ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకుని అహంకారంతో ఫోజు ఇచ్చాడు. దానిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. తర్వాత ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో భారతీయుల ఆత్మగౌరవం దెబ్బతింది.
ఎంతో ప్రతిష్టాత్మకరంగా భావించే ప్రపంచకప్ ని మార్ష్ తన కాళ్ల కింద పెట్టుకుని అవమానించడం, దీనికి తోటి ఆసిస్ క్రికెటర్ల అహంకారం కూడా తోడైంది. ఈ ఫొటో చూసిన భారతీయులందరూ బాధపడ్డారు గానీ ఎవరూ స్పందించలేదు.
ఆఖరికి ఐసీసీ కూడా ఒక్క కామెంట్ చేయలేదు. బీసీసీఐ కిమ్మనలేదు. ఆసిస్ బోర్డు కూడా మాట్లాడలేదు, అలాగే పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చే పొలిటికల్ లీడర్స్, సోకాల్డ్ పెద్దలు, బ్యూరోక్రసీ…ఇలా ఎవరూ స్పందించలేదు.
కానీ ఒకే ఒక్కడు స్పందించాడు. ఉత్తరప్రదేశ్ ఆలిగడ్ కి చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ స్పందించాడు. ట్రోఫీని అవమానించడమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను అగౌరపరిచినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఢిల్లీ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిమీద ప్రధానమంత్రికి కూడా పండిట్ కేశవ్ లేఖ రాశాడు. భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఎక్కడా కూడా మార్ష్ ఆడకుండా నిషేధించాలని కోరాడు. దీంతో పండిట్ కేశవ్ ని అందరూ ఆడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు.
క్రికెట్ ని ప్రేమించేవారెవరూ ఇలా చేయరు: షమీ
ఈ విషయంపై మహ్మద్ షమీ స్పందించాడు. ప్రపంచ కప్ ని కాళ్ల కింద పెట్టుకోవడం నాకు నచ్చలేదని తెలిపాడు. నిజానికి దానిని తల మీద పెట్టుకోవాలి. లేదా గుండెలకు హత్తుకోవాలి తప్ప కాళ్ల కింద పెట్టకూడదు. దాని స్థానం అది కాదని అన్నాడు. అలా కాళ్ల కింద పెట్టుకునే కప్పు కోసమా? నాలుగేళ్లుగా ఎదురుచూసి అన్ని మ్యాచ్ లు గెలిచి సాధించింది? అని అన్నాడు. ఆ కప్ కి ఇచ్చే గౌరవం అది కాదని అన్నాడు. ఒక క్రికెటర్ గా క్రికెట్ ని ప్రేమించాలి. క్రికెట్ ని ప్రేమించేవాడైతే…వరల్డ్ కప్ ట్రోఫీని ప్రాణం కన్నా ఎక్కువగా భావించాలి. కానీ ఆ పని మార్ష్ చేయలేదు. ఈ ఘటన నన్ను చాలా బాధించిందని తెలిపాడు.