Cameron Green : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్. పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్ లో కూడా మెరుపులు మెరిపించిన వారిలో తను కూడా ఒకడిగా ఉన్నాడు. ఇంతవరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఆడిన గ్రీన్, 2024లో ఆర్సీబీకి వచ్చాడు. ఇదిలా ఉండగా… ఆస్ట్రేలియా ఆటగాళ్లు రోజుకొక సంచలన వార్తలతో క్రికెట్ ప్రపంచాన్ని షాక్ లకు గురి చేస్తున్నారు.
మిచెల్ జాన్సన్-డేవిడ్ వార్నర్ మధ్య ఇంకా మాటల యుద్ధం ఆగలేదు. తాజాగా వార్నర్ సెంచరీ చేసి…నన్ను విమర్శించే వారందరూ…ఇక నోరు మూసుకోండి అని సమాధానమిచ్చాడు.
ఇప్పుడంతకు మించి ఒక షాకింగ్ వార్తను ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ చెప్పి, క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేశాడు. పాకిస్థాన్తో జరిగే మూడు టెస్టుల సిరీస్కు కామెరూన్ గ్రీన్ ఎంపికవ్వలేదు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు.
”పుట్టినప్పటి నుంచే నాకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఉందని అన్నాడు. దీనిని మామూలుగా గుర్తించలేం. అల్ట్రాసౌండ్తోనే గుర్తించాలి. ఇంతవరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలిపాడు.
నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే కిడ్నీ సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారని అన్నాడు. కిడ్నీలు సాధారణంగా ఉండాల్సినంత పరిణామంలో లేవని డాక్టర్లు చెప్పారని అన్నాడు. రోజులు గడిచేకొద్దీ నా ఆరోగ్యం మెరుగుపడింది. అంతేకాదు శారీరకంగా నేను దెబ్బతినలేదు. అదే ఇంత కాలం అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చాడు. నా కోచ్, ఇంకా జట్టులో కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసునని అన్నాడు. నేను చేయాల్సిందల్లా ఒకటే…ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకుంటే ఎక్కువ కాలం జీవిస్తానని తెలిపాడు.
ఈ ఫ్యామిలీ మీటింగులో గ్రీన్ తండ్రి మాట్లాడుతూ.. డాక్టర్లు 12 ఏళ్లకు మించి బతకలేడని చెప్పారని అన్నారు. తర్వాత గ్రీన్ తల్లి మాట్లాడుతూ.. 19 వారాల స్కానింగ్ లో ఈ వ్యాధి విషయం తెలిసిందని తెలిపారు. దాంతో మా బాధ వర్ణించలేమని అన్నారు. ధైర్యంకోల్పోకుండా తన ఆరోగ్యంపైనే ద్రష్టి పెట్టామని తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. కానీ గతం తలచుకుంటే మాత్రం చాలా భయంగా ఉంటుందని తెలిపారు.
24 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్ వచ్చే సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. ఇటీవల ముంబయి ఇండియన్స్ నుంచి రూ. 17.5 కోట్లు వెచ్చించి ఆర్సీబీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్య కోసమే కామెరూన్ గ్రీన్ను ముంబయి ఇండియన్స్ వదిలేసింది.