Shoaib Bashir : ఇంగ్లాండ్ యువ క్రికెటర్ షోయబ్ బషీర్ కు ఎట్టకేలకు భారత్ వీసా మంజూరైంది. అబుదాబీలో ఇంగ్లాండ్ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేసిన బషీర్ కి తొలుత ఇండియా వచ్చేందుకు అనుమతి లభించలేదు. పాకిస్తాన్ మూలాలు ఉండటంతో వీసా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో నిరాశగా తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఈ విషయంపై కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
బషీర్ వీసా సమస్యపై యూకే ప్రధాని రిషి సునాక్ కార్యాలయం కూడా స్పందించింది. సమస్య ఎక్కడ ఉందో చూడమని వీసా అధికారులను ఆదేశించింది. ఇండియాకి రావడానికి అవసరమైన పత్రాలన్నింటినీ వారు సమర్పించారు. దీంతో బషీర్ ప్రయాణ కష్టాలు తీరాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సరాసరి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి చేరవేసింది. ఈ వారాంతంలో బషీర్ బయలుదేరుతాడని అంటున్నారు.
20 ఏళ్ల బషీర్ తొలిసారి ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. నిజానికి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం స్పిన్ పిచ్ నకు అనుకూలంగా ఉండటంతో బషీర్ ను తీసుకుందామని అనుకున్నారు. కానీ అవకాశం కుదరలేదు. బహుశా తను రెండో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని అంటున్నారు. అంతేకాదు తన తొలి ఆరంగ్రేటం మ్యాచ్ అక్కడే ఆడతాడనే ఆశాభావాన్ని కెప్టెన్ వ్యక్తం చేశాడు.
ఇకపోతే పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆటగాళ్లు చాలామంది తమ పత్రాలను సమర్పించడంలో ఆలస్యం చేస్తుంటారని, అందుకనే తరచూ ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు గతంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు.
ఈ విషయంలో ఇంగ్లాండ్ లోని ప్రధాని కార్యాలయం స్పందించడంతో పనులు చకచకా జరిగాయని అంటున్నారు. ఇండియా నుంచి ఎటువంటి చిన్న సంఘటన జరిగినా లండన్ మీడియా గోరంతలు కొండంతలు చేసి రాస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.
ఒక్క ఇంగ్లాండ్ జట్టులో ఒక ఆటగాడి విషయంలోనే యక్ష ప్రశ్నలేస్తే, ఒకవేళ ఒలింపిక్స్ నిర్వహించాలంటే వీసాలు ఎలా మంజూరు చేస్తారని, అప్పుడు కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడైతే ఆటగాళ్లు మాత్రమే వస్తారని, అప్పుడైతే జర్నలిస్టులు, విదేశీ ప్రతినిధులు, అభిమానులు ఎంతోమంది వస్తారని చెబుతున్నారు. క్రీడలకు సంబంధించి భారత్ నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి బషీర్ కి వీసా మంజూరు కావడంతో వివాదం సద్దుమణిగింది.