AFG V NZ Test Match: గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఆఫ్గాన్ వర్సెస్ కివీస్ టెస్టు మ్యాచ్ పై తీవ్ర దుమారం రేగుతోంది. అసలెందుకు ఇండియాలో ఇవి ఆడాల్సి వచ్చిందంటే.. ఆఫ్గాన్ క్రికెట్ ఉన్నతికి ఇండియా సహకారం అందిస్తోంది. ఆ క్రమంలో ఆఫ్గాన్ లో ఐదురోజులు టెస్టు మ్యాచ్ లు ఆడే స్టేడియంలు లేకపోవడంతో బీసీసీఐను రిక్వెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ మూడు ప్రాంతాలు బెంగళూరు, కాన్పూరు, గ్రేటర్ నోయిడాలను సెలక్ట్ చేసుకోమని సూచించింది. దీంతో ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) గ్రేటర్ నోయిడా ఎంపిక చేసుకుంది. ఇంతకీ రచ్చ ఎందుకంటే కివీస్ తో సోమవారం టెస్టు మ్యాచ్ ప్రారంభం కావాలి. కానీ వరుసగా రెండు రోజులు వర్షం రావడంతో మ్యాచ్ కి అంతరాయం ఏర్పడింది. అంతేకాదు గ్రేటర్ నోయిడా స్టేడియంకి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ నిర్వహించే సీన్ లేదు. అదీ రోజు మరోసారి రుజువైంది.
ఎందుకంటే కురిసిన వర్షం గ్రౌండు నుంచి బయటకు వెళ్లే మార్గం లేక, అక్కడే నిలిచిపోయింది. దీంతో మిగిలిన మూడు రోజుల్లో కూడా టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాల్లేవని తేలిపోయిందని అంటున్నారు. అయితే ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు కావాలనే డబ్బులకు ఆశపడి గ్రేటర్ నోయిడా స్టేడియంను ఎంచుకుందునే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే బీసీసీఐ కూడా కావాలనే గ్రేటర్ నోయిడా స్టేడియంను అంటగట్టిందని అంటున్నారు.
Also Read: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు
ఒకసారి 2017లో గ్రేటర్ నోయిడా స్టేడియంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరగడంతో బీసీసీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత బీసీసీఐ అనుబంధిత టోర్నీ ఒక్కటి జరగలేదు. అన్నిటికి మించి.. ఏ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ స్టేడియం లేదు. గ్రేటర్ నొయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. అందువల్లే ఇంత అధ్వానంగా మారిందని అంటున్నారు.
ఇకపోతే కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూంలు అధ్వానంగా ఉన్నాయని అంటున్నారు. మహిళలవి కూడా పురుషులే వాడుతున్నారని చెబుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే గతంలో ఆఫ్గనిస్తాన్ ఇక్కడ కొన్ని మ్యాచ్ లు ఆడింది. ఆ ఉద్దేశంతోనే ఈసారి ఎంపిక చేసుకుని ఉంటారని అంటున్నారు.
స్టేడియం ఎంపిక విషయంలో బీసీసీఐ తప్పులేదని అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారి మెహనాజుద్దీన్ రాజ్ స్పష్టం చేశారు. గ్రేటర్ నోయిడా ఢిల్లీకి దగ్గరగా ఉండటం, అన్నింటికి మించి మా దేశం కాబూల్ నుంచి ఢిల్లీ దగ్గరగా ఉండటంతో, ఈ స్టేడియంను ఎంపిక చేశామని తెలిపారు. వర్షం రావడం వల్లే ఇంత గందరగోళం జరిగిందని లేదంటే చక్కగా ఎవరికి వాళ్లు ఆడి వెళ్లిపోయేవారని అన్నారు.