Kane Williamson : న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇకపై టీ20లు, వన్డేల్లో మాత్రమే సారథ్యం వహించనున్నాడు. మరి టెస్టుల్లో ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అనేది ఇంకా స్పష్టం చేయలేదు.
కెప్టెన్సీ అదుర్స్
2016లో అప్పటి కివీస్ కెప్టెన్ బ్రెండెన్ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు కేన్ విలియమ్సన్ కు అప్పగించారు. 6 ఏళ్లుగా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న కేన్..జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కేన్ సారథ్యంలోని కివీస్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. భారత్ ను ఓడించి ఈ టైటిల్ దక్కించుకుంది. విలియమ్సన్ నాయకత్వంలో న్యూజిలాండ్ జట్టు 38 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కేన్ సారథ్యంలో కేవలం 8 టెస్టుల్లో మాత్రమే కివీస్ ఓడింది.
టెస్ట్ కెరీర్..
కేన్ విలియమ్సన్ ఇప్పటి వరకు 88 టెస్టులు ఆడి.. 7,368 పరుగులు చేశాడు. సగటు 52.62 పరుగులుగా ఉంది. ఇందులో 24 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 251 పరుగులు. టెస్టుల్లో 30 వికెట్లు కూడా తీశాడు కేన్. ఒక ఇన్నింగ్స్ లో బెస్ట్ బౌలింగ్ 4/44. గొప్ప ఫీల్డర్ అయిన కేన్… టెస్టుల్లో 74 క్యాచ్ లు పట్టాడు.
వన్డే, టీ20 కెప్టెన్సీ..
కేన్ విలియమ్సన్ వన్డేల్లోనూ జట్టు విజయపథంలో నడిపిస్తున్నాడు. కివీస్ జట్టు 2019 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ఆ ఫైనల్ వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే గొప్పగా మ్యాచ్ గా నిలిచిపోయింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దురుదృష్టం కొద్దీ త్రుటిలో కప్ చేజారింది. అటు టీ20 ల్లోనూ కేన్ సారథ్యంలోని కివీస్ అద్భుతంగా రాణిస్తోంది.
సౌథీకి బాధ్యతలు
ఇక విలియమన్స్ స్థానంలో టెస్టుల్లో టిమ్ సౌథీ జట్టు కెప్టెన్సీ బాధ్యత చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్గా వికెట్ కీపర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. ఇక కొత్త కెప్టెన్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ టీమ్ ఈ నెలలోనే పాకిస్తాన్ లో పర్యటించనుంది. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ కరాచీలో ఈ నెల 26న ప్రారంభమవుతుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి జరుగుతుంది.