U19 World Cup 2024 : 2024 జనవరి 19 నుంచి జరిగే అండర్ 19 వరల్డ్ కప్ నకు ఇద్దరు తెలంగాణ యువ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావ్, మురుగన్ అభిషేక్ లను బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మన తెలుగువాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో ఆడటం శుభపరిణామం అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అండర్-19 ప్రపంచకప్ తో పాటు ముక్కోణపు సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అండర్ 19 వరల్డ్ కప్నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. నిజానికి శ్రీలంకలో జరగాల్సిన టోర్నమెంట్ ఇది. వన్డే వరల్డ్ కప్ 2023లో జరిగిన గొడవల నేపథ్యంలో శ్రీలంక సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది. అంతేకాదు ఈ టోర్నమెంట్ ని సౌతాఫ్రికాకి షిఫ్ట్ చేసింది.
ఇప్పుడీ ప్రపంచకప్ నకు ముందు డిసెంబర్ 29 నుంచి జనవరి 10 వరకు ఇంగ్లాండ్, సౌతాఫ్రికాతో కలిపి భారత్ ట్రై సిరీస్ ఆడనుంది. తెలంగాణ యువ ప్లేయర్లు అరవెల్లి అవనీశ్ రావ్, మురుగన్ అభిషేక్ ప్రపంచకప్ తో పాటు ముక్కోణపు సిరీస్ జట్టులో చోటు సంపాదించారు. 19 ఏళ్ల అభిషేక్ ఆల్రౌండర్. బ్యాటింగ్ తో పాటు ఆఫ్ స్పిన్నర్గా రాణిస్తున్నాడు.18 ఏళ్ల అవనీశ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉన్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియాకప్ లో కూడా ఆడుతున్నారు.
అరవెల్లి అవనీశ్ రావు సిరిసిల్ల నియోజకవర్గంలోని పోత్గల్ గ్రామానికి చెందినవాడు, అయితే మురుగన్ అభిషేక్ హైదరాబాద్ వాస్తవ్యుడు. వీరిద్దరూ భారత క్రికెట్ లో రాణించాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సౌమీ కుమార్ పాండే, అర్షిన్ కులకర్ణి, సచిన్ దాస్, ప్రియాంశు మోలియా, ముషీర్ఖాన్, అవనీశ్ రావు, ఇనీశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, మురుగన్ అభిషేక్, నమన్ తివారి, స్టాండ్బై: అన్ష్ గొసాయ్, ప్రేమ్ దేవ్కర్, మహ్మద్ అమన్