ODI World Cup : 2023 వన్డే ప్రపంచకప్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ ఉంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ ఇక్కడ ఒక్కటి కూడా జరగదు. టోర్నీ ముసాయిదా షెడ్యూల్ ను బీసీసీఐ రూపొందించింది. భారత్ ఆడే మైదానాల జాబితాలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లేదు. దీంతో హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
ఎంతో ఉత్కంఠగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్లో జరుగుతుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో టోర్ని ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోనే జరుగుతుంది. ఈ ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీ.. ప్రపంచకప్లో ఆడే అన్ని దేశాలకు పంపిస్తుంది. వాళ్ల అభిప్రాయాలు తెలిపిన తర్వాత వచ్చే వారం ఫైనల్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
సెమీఫైనల్స్ నవంబర్ 15, 16 తేదీల్లో జరుగుతాయి. అయితే ఎక్కడ జరిగేది ఇంకా ప్రకటించలేదు. ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్లో వేదికగానే జరగనుంది. భారత్ తన లీగ్ మ్యాచ్లను 9 మైదానాల్లో ఆడనుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో , అక్టోబర్ 11న అఫ్గానిస్థాన్తో ఢిల్లీలో, అక్టోబర్ 15న పాకిస్థాన్తో అహ్మదాబాద్ లో,
అక్టోబర్ 19న బంగ్లాదేశ్తో పుణెలో, అక్టోబర్ 22న న్యూజిలాండ్తో ధర్మశాలలో, అక్టోబర్ 29న ఇంగ్లాండ్తో లక్నోలో ఆడుతుంది. నవంబర్ 2న క్వాలిఫయర్తో ముంబైలో,నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో కోల్కతాలో, నవంబర్ 11న క్వాలిఫయర్తో బెంగళూరులో టీమ్ఇండియా తలపడనుంది.