Cancer : ఒకప్పుడు క్యాన్సర్ అనేది అందరినీ భయపెట్టే ఒక ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్ సోకిందంటే చాలు.. ఇక దానికి చికిత్స లేదని అందరూ అనుకునేవారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటి ప్రాణాంతక వ్యాధికి కూడా చికిత్స మొదలయ్యింది. చికిత్స దొరికిందని సంతోషించకుండా.. శాస్త్రవేత్తలు దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే క్యాన్సర్ బయటపడకముందే దానిని కనిపెడతామంటున్నారు.
క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లు అంత తొందరగా బయటపడవు. అందుకే వాటికి చికిత్స అందించేలోపు అది ప్రాణాలనే బలిదీసుకునే స్థాయికి చేరుకుంటోంది. అలా కాకుండా కేవలం యూరిన్తో 12 ఏళ్ల ముందే బ్లాడర్ క్యాన్సర్ను కనుక్కోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది త్వరలోనే సాధ్యపడుతుందని వారు హామీ ఇస్తున్నారు. బ్లాడర్ క్యాన్సర్లోనే కామన్ టైప్ను జెనటిక్ మ్యూటేషన్స్ ద్వారా కనుక్కోవచ్చని వారు చెప్తున్నారు.
బ్లాడర్ క్యాన్సర్ అనేది మామూలుగా ముందే కనుక్కోవడం కష్టం. అడ్వాన్స్ స్టేజ్లో మాత్రమే అది బయటపడుతుంది. అప్పుడు చికిత్స అందించినా కూడా వారు 5 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవించలేరు. బ్లాడర్ క్యాన్సర్ సోకిన వారు 50 శాతం మృత్యువాత పడ్డారని రికార్డులు చెప్తున్నాయి. అయితే మూత్రంలో కలిగిన జెనటిక్ మార్పులను పరీక్షించడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 80 శాతం వరకు గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల ఇది ఇప్పుడే పూర్తిగా సాధ్యపడడం లేదని అన్నారు.
త్వరలోనే యూరిన్ టెస్ట్తో బ్లాడర్ క్యాన్సర్ను కనిపెట్టే సులువైన మార్గాలను కనుక్కుంటామన్నారు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా ఈ క్యాన్సర్ను కనుక్కోవడం కోసం యూరోయాంప్ అనే కొత్త టెస్ట్ను ప్రవేశపెట్టనున్నారు. యూరోయాంప్ అంటే ‘ఏ యూరిన్ కాంప్రిహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ టెస్ట్’. 60 రకాల జీన్స్లో జరిగే మార్పులను ఈ టెస్ట్లో గమనింవచ్చు. ఇప్పటికే 50 వేల మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. అందులో 66 శాతం పేషెంట్లపై ఈ ప్రయోగాం సక్సెస్ అయ్యిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.