mountains : టెక్నాలజీతో ఏదైనా తయారు చేయవచ్చు, ఏ పని అయినా సులభంగా చేయవచ్చు. కానీ ప్రకృతిని మాత్రం సృష్టించలేము. టెక్నాలజీ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో కనిపెట్టగలం, కానీ దానిని కాపాడలేకపోతున్నాం. అడవులను తొందరగా నాశనం చేయడానికి పనిచేసే టెక్నాలజీ.. వాటిని మళ్లీ పెంచడానికి మాత్రం ముందుకు రావడం లేదు. తాజాగా పర్వత అడవులకు కూడా ఈ టెక్నాలజీ వల్ల నష్టం జరుగుతుందే తప్ప లాభం కలగడం లేదని పర్యావరణవేత్తలు వాపోతున్నారు.
ఒక్కొక్క ప్రాంతంలో అడవులు ఎకరాల కొద్దీ విస్తరించి ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడవి పర్వతం ఆకారంలో ఏర్పడుతుంది. అయితే ఇప్పటివరకు పర్వతం లాగా విస్తరించి ఉన్న అడవులకు నష్టం చేకూర్చడం ఎవరి వల్ల కాలేదు. అడవి నిర్మూలన అనేది జరగడం కష్టంగా ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఈ పర్వత అడవులకు కూడా ముప్పు తప్పడం లేదు. మెల్లగా వాటి నిర్మూలన కూడా మొదలయ్యింది. దీని వల్ల డీఫారెస్టేషన్.. మానవాళికి హాని కలిగించే స్థాయికి పెరగనుందని నిపుణులు చెప్తున్నారు.
21వ శతాబ్దం ప్రారంభమయినప్పటి నుండి డిఫారెస్టేషన్ శాతం విపరీతంగా పెరిగిపోయింది. అయితే అది కొన్ని అడవి ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ పర్వత అడవుల వరకు వచ్చేసింది. వీటికి జరుగుతున్న నష్టంపై పలువురు పరిశోధకులు పరిశోధనలు చేపట్టారు. చైనా, యూకే వంటి దేశాల్లో అడవులకు జరుగుతున్న నష్టంపై వీరు సర్వే నిర్వహించారు. ముఖ్యంగా 2001 నుండి 2018 మధ్యలో వచ్చిన మార్పులను వారు గమనించారు.
అడవులకు జరుగుతున్న నష్టాలతో పాటు లాభాలను కూడా లెక్కవేశారు. బయోడైవర్సిటీపై దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నదానిపై పరిశోధకులు స్టడీ చేశారు. అడవులు అంతరించిపోతున్నాయి అనే సమయానికి అక్కడ జీవించే జీవరాశులు వేరే అడవులకు తరలివెళుతుంటాయి. అలాంటి సమయంలో అడవి అనేది అంతరించిపోవడం మొదలవుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు వారి స్టడీలో చేర్చారు పరిశోధకులు.
ముందుగా చెట్లు కొట్టేయడం వల్ల పర్వత అడవులకు 42 శాతం నష్టం చేకూరుతుంది. ఆ తర్వాత కార్చిచ్చుల వల్ల 29 శాతం అడవులు నాశనమైపోతున్నాయి. షిఫ్టింగ్ వల్ల 15 శాతం, సెమీ పర్మనెంట్ అగ్రికల్చర్ వల్ల 10 శాతం అడవులపై చెడు ప్రభావం పడుతుందని పరిశోధకులు చేసిన స్టడీలో తేలింది. 2010 నుండి 2018 మధ్యలో దాదాపు 5.2 మిలియన్ హెక్టార్ల పర్వత అడవులు నాశనమయిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికైనా దీనిని అదుపు చేయాలని లేకపోతే బయోడైవర్సిటీకి తీవ్ర నష్టం జరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.