Sync Brainwaves:- పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచడానికి ఏం చేయాలి? మెరుగ్గా చదివే పిల్లలతో పోటీపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి సందేహాలు చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటాయి. వీటికోసం ఏం చేయాలి అని సైంటిఫిక్గా పలు చిట్కాలు కూడా పాటిస్తారు కొందరు తల్లిదండ్రులు. అయితే తాజాగా జరిగిన పరిశోధనల్లో పిల్లల బ్రెయిన్స్, టీచర్స్ బ్రెయిన్స్తో సింక్ అయితే.. చదువు విషయంలో చురుగ్గా ఉంటారని తేలింది.
పిల్లలు ఎలా చదివితే గుర్తుపెట్టుకుంటారు అనే అంశంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. అలాంటి ఒక తాజా పరిశోధనలోనే మెదడుతో మెదడు సింక్ అవ్వడం వల్ల వారి చదువు మెరుగుపడుతుందని తెలిసింది. దీంతో శాస్త్రవేత్తలు కూడా ఈ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. క్లాసులో పాఠాలు విన్న విద్యార్థులు వాటిని ఎంతవరకు గుర్తుపెట్టుకోగలరు అనే కోణంలో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగాయి. కానీ టీచర్స్ బ్రెయిన్స్తో స్టూడెంట్స్ బ్రెయిన్స్ సింక్ అయితే వారు చదువులో మెరుగు అవుతారని మాత్రం ఇప్పుడే కనిపెట్టారు.
మామూలుగా ఇతరులతో ఎక్కువగా మాట్లాడితే.. వారితో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తే.. జ్ఞానం అనేది పెరుగుతుందని అన్నది ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో తేలింది. అయితే బ్రెయిన్వేవ్స్ సింక్ అవ్వడం వల్లే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తోటి విద్యార్థుల బ్రెయిన్స్తో సింక్ అయినవారు, టీచర్స్ బ్రెయిన్స్తో సింక్ అయిన విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారని చెప్తున్నారు. మామూలుగా చదువు విషయంలో మెదడు ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా టెక్నిక్స్ ఏమీ లేవు.
బ్రెయిన్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడానికి చేసిన పరిశోధనల వల్ల ఈ సింక్ విధానం గురించి బయటపడింది. దీనికోసం వారు ఈఈజీ పరీక్షలు నిర్వహించారు. ఎలక్ట్రో ఎన్సోఫలోగ్రాఫీ (ఈఈజీ) అనేది బ్రెయిన్ యాక్టివిటీని తెలుసుకోవడం కోసం చేసే పరీక్ష. ఈ పరీక్ష కోసం కొంతమంది స్కూల్ విద్యార్థులను శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. వీరందరికి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జాగ్రత్తపడ్డారు. ముందుగా వారికి కొన్ని పాఠాలు చెప్పిన తర్వాత విద్యార్థుల బ్రెయిన్ యాక్టివిటీని స్టడీ చేశారు.
చెప్పిన పాఠాలపై పరీక్షలు కూడా రాశారు విద్యార్థులు. చెప్పిన వారి బ్రెయిన్తో ఎక్కువగా సింక్లో ఉన్న విద్యార్థులు పరీక్షలు బాగా రాశారని, తక్కువ సింక్లో ఉన్నవారి పర్ఫార్మెన్స్ అంతగా బాలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందుకే క్లాస్ రూమ్లో టీచర్ల బ్రెయిన్తో సింక్ అయిన విద్యార్థులు చదువు విషయంలో మెరుగ్గా ఉంటున్నారని, మిగతావారు వారికంటే కొంచెం తక్కువలో ఉంటున్నారని తెలిపారు. మెరుగ్గా ఉండాలంటే ఏకాగ్రత కూడా చాలా ముఖ్యమని విద్యార్థులకు శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు.