Scientists grow plants in lunar soil : చంద్రుని శిలాధూళితో శాస్త్రవేత్తలు తొలిసారిగా శనగలను పండించగలిగారు. చంద్రుని ధూళితో కలగలసిన మట్టిలో శనగ మొక్కలను విజయవంతంగా పెంచగలిగారు. భవిష్యత్తు చంద్రమండల యాత్రల్లో ఆహార సమస్యను అధిగమించడానికి ఈ ఆవిష్కరణ కొత్త ద్వారాలను తెరిచినట్లయింది. టెక్సస్ ఏ అండ్ఎం కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ లైఫ్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు ప్రయోగం చేశారు.
75% లూనార్ రెగొలిస్(regolih) ఉన్న మట్టి మిశ్రమంలో శనగ మొక్కలు ఏపుగా
పెరగగలిగాయని తమ పరిశోధనా పత్రంలో వివరించారు. భవిష్యత్తులో
తమకు అవసరమైన ఆహారాన్ని ఇకపై భూమిపై నుంచి మోసుకెళ్లాల్సిన ప్రయాస
వ్యోమగాములకు తప్పుతుంది. పైగా ఇది వ్యయప్రయాసలతో కూడిన
వ్యవహారం. పరిశోధనల నిమిత్తం దీర్ఘకాలం అంతరిక్షంలోనే వారు గడపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే తగిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలిగే అవకాశం చిక్కుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోదసిలో ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకునే బాధ కూడా తప్పుతుంది. దానిని పదే పదే సరఫరా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా.. మొక్కల పెంపకంతో రోదసిలో మట్టికి పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి.
వాస్తవానికి చంద్రునిపై శిలాధూళి పంటలకు ఏ మాత్రం అనువు కాదు. కానీ దానికి మట్టి, సేంద్రియ ఎరువు, ఎర్త్ సాయిల్ ఫంగైను చేర్చడం ద్వారా శాస్త్రవేత్తలు ఆ ధూళిని సారవంతమైన మిశ్రమంగా మార్చగలిగారు. మూన్డస్ట్లోని కలుషితాలను ఫంగై, వర్మికంపోస్ట్ శోషించుకునేలా చేశారు. మూన్ డస్ట్ లో నైట్రోజెన్ ఉండదు. మొక్కల కణాల పెరుగుదలకు నత్రజని ఎంతో అవసరం. భూమిపై ఉండే మన్నులో ఇది పుష్కలంగా లభ్యమవుతుంది. చంద్రుడిపై శిలాధూళిలో ఇది ఉండనే ఉండదు. పైపెచ్చు నీరు లేని కారణంగా మూన్డస్ట్ చాలా పొడిగా ఉంటుంది.
శనగ మొక్కల వేర్లలోకి చేరకుండా చంద్రుని ధూళిలోని టాక్సిన్లను ఎర్త్ సాయిల్ ఫంగై
అడ్డుకుందని శాస్త్రవేత్తలు వివరించారు. వర్మికంపోస్ట్ వల్ల శిలాధూళి మిశ్రమంలో పోషకాలు పెరిగి.. మొక్కల వేళ్లు బలంగా పెరిగేలా చేస్తాయని చెప్పారు. ఇతర పంటలకు భిన్నంగా శనగ మొక్కల ఎదుగుదలకు నీరు, నత్రజని అవసరం ఎంతో తక్కువ. ఈ కారణంగా శాస్త్రవేత్తలకు తమ పరిశోధనలకు శనగనే ఎంచుకున్నారు.
భూమిపై శనగ మొక్కలు పెరగడానికి వంద రోజులు పడితే.. చంద్రుని శిలాధూళిలో 120 రోజుల సమయం తీసుకున్నాయి. మెడికల్ ఆర్కైవ్స్లో ప్రచురితమైన ఈ పరిశోధన ఫలితాలపై తులనాత్మక సమీక్ష జరగాల్సి ఉంది.