Satellite Pollution : భూవాతావరణమే కాదు.. ఆవల ప్రాంతం కూడా కాలుష్యమయమైపోతోంది. మనం పంపుతున్న ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల కారణంగా వాతావరణంలో లోహపు తునకల బెడద పెరుగుతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రోదసి వ్యర్థాలు భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు సురక్షితంగా కాలిపోవాలి. కానీ అవి స్ట్రాటోస్పియర్ స్వరూపాన్నే దెబ్బ తీసే స్థాయికి చేరాయి.
ఇది భూవాతావరణంలో రెండో పొర. భూఉపరితలం నుంచి 16-51 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. పుడమికి కవచంలా భావించే ఓజోన్ పొర ఉండేది ఇక్కడే. లోహపు తునకల కాలుష్యం ప్రభావం స్ట్రాటోస్పియర్పై ఏ విధంగా ఉంటుందన్నది నిశితంగా పరిశీలించాల్సి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్ష రంగం రాకెట్ స్పీడ్తో వర్థిల్లుతున్నందున స్ట్రాటోస్పియర్ భవితవ్యంపై ఆందోళన నానాటికీ తీవ్రమవుతోంది.
లిథియం, కాపర్, అల్యూమినియం, లెడ్ తదితర లోహాలు కాస్మిక్ డస్ట్లో మోతాదును మించిపోయాయని యూనివర్సిటీ ఆఫ్ పర్ద్యూ పరిశోధనలో వెల్లడైంది. నాసా డబ్ల్యూబీ-57 విమానాన్ని పరిశోధకులు అలాస్కాలో భూమికి 19 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటోస్పియర్ వాతావరణంలోకి పంపి అక్కడి శాంపిల్ను సేకరించారు. లోహాలతో పాటు 10% మేర సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏరోసెల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇదంతా స్పేస్క్రాఫ్ట్, శాటిలైట్ వ్యర్థాల నుంచి వచ్చిందే.
ఏరోసెల్స్ కారణంగా ఏర్పడే మంచు మేఘాలు భూమికి చేరకపోయినప్పటికీ.. పోలార్ స్ట్రాటోస్పియర్ మేఘాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన డేనియల్ మర్ఫీ వెల్లడించారు. ఓజోన్ పొర దెబ్బ తినడానికి అది కారణమయ్యే ప్రమాదం లేకపోలేదని వివరించారు. దీనిపై మరింత అధ్యయనం అవసరమని చెబుతున్నారు.
2030 నాటికి భూకక్ష్య చుట్టూ 50 వేల ఉపగ్రహాలు తిరుగుతుంటాయని పరిశోధకుల అంచనా. స్పేస్ ఎక్స్ నుంచి వేల సంఖ్యలో ఉపగ్రహాలు రోదసి నిండా వ్యాపించాయి. ఇది ఇక్కడితో ఆగదు. స్పేస్-ఎక్స్ మరిన్ని శాటిలైట్ల ప్రయోగానికి సిద్ధపడుతుండగా.. అమెజాన్ వంటి పోటీ సంస్థలు ఈ రంగంలోకి దూసుకొస్తున్నాయి. నిరుడు రికార్డు స్థాయిలో180 రాకెట్లను ప్రయోగించారు. ఈ ప్రయోగాలు, ఉపగ్రహాల సంఖ్యతో పాటే కాస్మిక్ డస్ట్ పెరగడం ముమ్మాటికీ ఖాయం.