Robots: రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటివి మనిషి మేధస్సునే మించిపోతాయి అనే విషయాలు మనం తరచుగా వింటూనే ఉన్నాం. కానీ అదంతా పూర్తిగా నిజం కాదని వాదించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారి వాదన నిజమే అని ఎన్నోసార్లు నిరూపణ కూడా అయ్యింది. మనుషులకు కూడా సమాధానం తెలియని ప్రశ్నలకు రోబోలు ఎలా సమాధానం చెప్తాయి. ఒకవేళ సమాధానం చెప్పినా.. అది నిజమే అని గ్యారెంటీ ఏంటి అని శాస్త్రవేత్తల్లో అనుమానం మొదలయ్యింది.
ఒకవేళ మనుషులు ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి రోబో చెప్పిన సమాధానం అబద్ధం అని తెలిస్తే.. మళ్లీ మనుషులు ఇలాంటి యంత్రాలను నమ్మే వీలుందా అని అడిగితే.. చాలావరకు నమ్మడం కుదరదు అనే సమాధానమే వినిపిస్తుంది. దీనిని సరిచేయడం కోసం ఇద్దరు యంగ్ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. రోబో అబద్ధం చెప్పినట్టు తెలుసుకున్న తర్వాత దానితో మనుషులకు సారీ చెప్పించే టెక్నాలజీని రోబోలో పొందుపరిచారు. ఈ టెక్నాలజీ ఏఐ విషయంలో కూడా ఉపయోగపడుతుందని వారు అన్నారు.
ఒక రోబో అబద్ధం చెప్పితే.. అది మనిషి మంచికోసమే అయినా మరోసారి ఆ రోబోను మనుషులు నమ్మడం ఆపేస్తారు. అలా జరగకుండా ఉండడానికే తాము ఈ టెక్నాలజీని తయారు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. రోబోలతో ఎక్కువకాలం ట్రావెల్ చేయాలనుకునేవారు ఒక్కసారి అది సారీ చెప్పగానే మళ్లీ దానిని మునుపటిలాగా నమ్మే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ కోణంలో వారి ప్రెజంటేషన్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. రోబోలకు సారీ చెప్పడం నేర్పించే విషయంలో వారికి ఏఐ కూడా సాయం చేసిందని బయటపెట్టారు.
ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో అడ్వాన్స్ రోబోలు వచ్చినా కూడా వాటిపై మనుషులకు పూర్తిగా నమ్మకం కలగడం లేదు. అందుకే రోబోలు తప్పు చేసినప్పుడు లేదా అబద్ధం చెప్పినప్పుడు తమకు తాముగా తెలుసుకొని సారీ చెపితే అవి మనుషులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఫ్రెండ్లీ రోబోలు అనేవి సారీ చెప్పి మనుషులకు దగ్గరకు తీసుకునేలా ఉండాలని వారు తెలిపారు. అందుకే రోబోటిక్స్ రంగంలో ఈ యంగ్ సైంటిస్టులు చేసిన అద్భుతం ప్రశంసనీయంగా మారింది.