Treatment Of Cancer : మనిషి శరీరంలో ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఏంటి, ఎందుకు జరుగుతూ ఉంటాయని ఇప్పటివరకు చాలామందికి పూర్తిగా అవగాహన లేదు. వారికి తెలియకపోయినా కూడా ఏ యాక్టివిటీకి అయినా డ్యామేజ్ జరిగినా.. లేదా ఆటంకం కలిగినా.. అది మనిషి పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. తాజాగా మనిషి శరీరంలోని సెల్స్ మరణం గురించి మనుషులకు అవగాహనను ఏర్పరిచే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు.
సెల్స్ మరణం అనేది కేవలం మనిషిలోనే కాదు.. ప్రాణం ఉన్న ప్రతీ జీవిలోనూ ముఖ్యమే. ప్రస్తుతం ఉన్న సెల్స్ మరణించి.. ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ ప్రాణం పోసుకోవడమే మనిషి హెల్తీగా ఉన్నాడు అనేదానికి సూచన అని శాస్త్రవేత్తలు వివరించారు. డ్యామేజ్ అయిన సెల్స్ లేదా వైరస్ సోకిన సెల్స్ అనేవి ఇతర అవయవాలకు సోకకుండా ఆత్మహత్య చేసుకుంటాయి. అలా జరగడం వల్లే ట్యూమర్స్ లాంటివి ఏర్పరకుండా మనిషి ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు ఈ సెల్స్ మరణం గురించి తెలుసుకోవడం కోసం పలు పరిశోధనలు జరిగాయి. కానీ తాజాగా స్విట్జర్ల్యాండ్లోని శాస్త్రవేత్తలు సెల్స్ మరణంలోని ఫైనల్ స్టేజ్పై ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టారు. సెల్స్ మరణంలో నింజురిన్ 1 అనే ప్రొటీన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని వారి పరిశోధనల్లో తేలింది. ముందుగా ఈ ప్రొటీన్ సెల్స్ అన్నింటిని ఒకేచోట చేర్చి ఆపై అవి మరణించేలా చేస్తుందని తెలిపారు. సెల్స్ మరణం విషయంలో ఈ కొత్త పరిశోధన మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ముందుగా సెల్స్ మరణించాలి అని సూచన రాగానే రెండు నింజురిన్ 1 ప్రొటీన్స్ కలిసి సెల్స్ మెంబ్రేన్లోకి చేరతాయి. ఆ తర్వాత అవి సెల్స్లో రంధ్రాలు ఏర్పడేలా చేస్తాయి. మెల్లగా అలా సెల్స్ అన్నీ మరణిస్తాయి. నింజురిన్ 1 ప్రొటీన్పై మరిన్ని పరిశోధనలు చేస్తే.. సెల్స్ మరణం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సెల్స్ మరణాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగితే.. క్యాన్సర్ లాంటి సమస్యలకు కూడా సులువుగా మెరుగైన పరిష్కారాలు కనుక్కునే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.