sleeping disorders:ప్రస్తుతం ఏ రంగంలో పనిచేసే ఉద్యోగులకు అయినా ఒత్తిడి పెరిగిపోతోంది. దాని కారణంగా వారు పరిమితికి మించి పనిచేయవలసి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా చాలామందికి సరిపడా నిద్ర ఉండడం లేదు. అయితే ఎంత మోతాదులో శారీరికంగా శ్రమిస్తే నిద్రపడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు సరిపడా నిద్రపోవాలంటే ఏం చేయాలి అనేదానిపై నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
సరిపడా నిద్ర లేకపోవడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. మెటాబాలిక్ వ్యాధులు, మానసిక వ్యాధులు, డిమెన్షియా వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే సరిపడా నిద్ర అవసరం. ఇన్సోమ్నియా, నార్కొలాప్సీ, ఎక్కువగా నిద్రపోవడం కూడా మనుషులను పేషెంట్లుగా మార్చేస్తాయని అంటున్నారు వైద్యులు. అమెరికాలో దాదాపు 50 నుండి 70 శాతం యువతీయువకులు ఇన్సోమ్నియాతో బాధపడుతున్నట్టుగా సర్వేలో తేలింది. చైనాలో 15 శాతం యువతకు ఈ సమస్య ఉంది.
ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే సరిపడా నిద్ర అవసరం. అయితే లైఫ్స్టైల్ను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం వీటిని పరిష్కారం అని ఎంతోమంది చెప్పినా.. ఈ విషయంలో ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు చేయాల్సి ఉంది. తాజాగా జపాన్, కెనడా, తైవాన్ పరిశోధకులు కలిసి జపాన్లోని కొందరి వ్యక్తులను స్టడీ చేశారు. ముఖ్యంగా 40 నుండి 64 మధ్య వయసు ఉన్నవారిని వారి స్టడీ కోసం ఎంచుకున్నారు.
శరీరంపై ఒత్తిడి పెరిగేలా వారితో వ్యాయమం చేయిస్తూ పరిశోధకులు వారిని స్టడీ చేశారు. ఇలా వారం రోజుల పాటు రోజుకు ఒక గంట వారితో వ్యాయామం చేయించారు. వారు ఎంతగా అలసిపోయారో యాక్సెలరోమీటర్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత వారి ఎంతసేపు నిద్రపోయారు అనే విషయాన్ని ప్రశ్నించారు. ఒక దగ్గర కూర్చొని పనిచేయడం కంటే వ్యాయమం చేసినప్పుడే వారు సరిగ్గా నిద్రపోయారని తేలింది. ముఖ్యంగా దీనివల్ల మహిళలు సరిపడా నిద్రపోతున్నట్టుగా పరిశోధకులు గమనించారు.
ఈ పరిశోధన తర్వాత నిద్రలేమి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు పురుషుల్లో వేరుగా, మహిళల్లో వేరుగా ఉన్నట్టుగా పరిశోధకులు తెలుసుకున్నారు. అలా ఎందుకు జరుగుతుందో తెలియడానికి వారు మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. శరీరం అలసిపోతేనే సరిపడా నిద్ర లభిస్తుందని ఈ పరిశోధనల్లో మరోసారి తేలింది. అందుకే రోజుకు కాసేపైనా వ్యాయామం చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.