First Floating Solar Project:చండీగఢ్ అడ్మినిస్టేటర్, పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కలిసి ఉత్తర భారతంలోనే పెద్దదైన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ను శుభారంబం చేశారు. దాని కెపాసిటి 2000 కిలోవాట్ పవర్ (కెడబ్ల్యూపీ) అని సమాచారం. పూర్తిగా రూ.11.70 కోట్ల ఖర్చుతో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది.
దీంతో పాటు ధనాస్ నది వద్ద 500 కెడబ్ల్యూపీ కెపాసిటీతో మరో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను కూడా వారు ప్రారంభించారు. దానికోసం ప్రభుత్వం రూ.3.34 కోట్లు ఖర్చు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను చండీగఢ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ సొసైటీ (క్రెస్ట్) స్వీకరించి వీటిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సంవత్సరానికి కనీసం 35 లక్షల యూనిట్ల ఎనర్జీ వెలువడుతుందని తెలుస్తోంది.
ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత చండీగఢ్ అడ్మినిస్టేటర్ క్రెస్ట్ సామర్థ్యాన్ని ప్రశంసించారు. అంతే కాకుండా ధనస్ నదిని టూరిస్ట్ ప్రాంతంగా మార్చినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కూడా అభినందించారు. సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
ప్రస్తుతం ధనస్ నది వద్ద ఫౌంటేన్స్ ఏర్పాటు చేయడంతో ఇది అందమైన టూరిస్ట్ ప్రాంతంగా మారింది. దీని ద్వారా టూరిజం డిపార్ట్మెంట్కు కూడా ఆదాయం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. పైగా ఇలాంటి ఓ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ నార్త్ ఇండియాలోని మొదటిసారి ఏర్పాటు కావడంతో వారు మరింత గర్వపడుతున్నట్టుగా తెలిపారు. త్వరలోనే రెన్యువబుల్ ఎనర్జీని ఏర్పాటు చేసే విషయంలో చండీగఢ్ నూటికి నూరు శాతం విజయం సాధించనున్నట్టు తెలుస్తోంది.