Climate Control : భూతాపం పెరిగిపోతోంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది. భూమి వేడెక్కడం వల్ల ప్రపంచానికి తీరని నష్టం వాటిల్లుతుంది. ఎండలు మండిపోతాయి. మంచు పర్వతాలు కరిగిపోతాయి. ఇప్పటికే ఇలాంటి పరిణామాలు చూస్తున్నాం. భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రపంచ దేశాలు చేతల్లో చూపకపోయినా… మాటలు మాత్రం చెబుతున్నాయి. భూతాపం ఎక్కువైతే ఒక్క మనుషులకే కాదు భూమిపై ఉన్న సమస్త జీవజాలానికి ముప్పే. అలాంటి పరిస్థితే వస్తే స్వయంగా భూమియే రంగంలోకి దిగుతుంది. తన వేడిని తానే తగ్గించుకుంటుంది. అంటే భూదేవి స్వయంగా తన బిడ్డలను తానే కాపాడుకుంటుందన్నమాట. ఇది పురాణం కాదు. సైంటిఫిక్ గా నిరూపితమైన నిజం. మనిషికి జ్వరం వస్తే ఒంట్లోని వేడిని చెమట రూపంలో బయటకు పంపించి శరీరం తనను తాను ఎలాగైతే కాపాడుకుంటుందో… భూమి కూడా అలాగే అన్నమాట. ఈ ప్రక్రియను సిలికేట్ క్షీణతగా పిలుస్తారు. తన వేడిని తానే నియంత్రించుకునే యంత్రాంగం భూమికి ఉందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఎంఐటీ అధ్యయనం వెల్లడించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందన్నప్పుడు భూమి రంగంలోకి దిగి వేడిని బయటకు పంపి వాతావరణాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. అయితే దీనికి లక్షలాది సంవత్సరాలు పడుతుందని ఆ అధ్యయనం తెలిపింది.
ఇంతకీ సిలికేట్ క్షీణత అంటే ఏంటి?
ఖనిజాలు రసాయనికంగా క్షీణించే క్రమంలో కొత్త ఖనిజాలుగా, ఖనిజ ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతాయి. కొన్ని ఖనిజాలు పూర్తిగా కరిగిపోతాయి. మరికొన్ని ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలు హైడ్రాలిసిస్ అనే రసాయనిక చర్యతో మారిపోతాయి. అయితే ఇదంతా చాలా స్లోగా జరిగే ప్రక్రియ. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, ఉపరితల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీటి రసాయన క్షీణత వేగంగా జరుగుతుంది. అప్పుడు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ని మరింత ఎక్కువగా సంగ్రహిస్తాయి. ఇది సిలికాన్ రాళ్లలో నిక్షిప్తమవుతుంది. దీనివల్ల వాతావరణ:లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. గత 66 కోట్ల కాలంలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను సైంటిస్టులు విశ్లేషించి ఒక నిర్దారణకు వచ్చారు. అంటే ఎంత పెద్ద ఉపద్రవాలు ముంచుకొచ్చినా వాటి నుంచి భూమి తన బిడ్డల్లాంటి జీవజాతులను కాపాడుకుంటుందన్నమాట.