WhatsApp: వాట్సాప్ వినియోగదారులను కొత్త కొత్త పద్దతులతో బురిడీ కొట్టిస్తున్నారు స్కామర్లు. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాల్లో దాడులకు తెగబడుతున్నారు. వాట్సాప్ వేదికగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త స్కామ్ కు తెర లేపారు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అకౌంట్లలోని డబ్బులను పైసా లేకుండా ఊడ్చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన కొత్త వాట్సాప్ స్కామ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బ్యాంకుల పేరుతో కొత్త మోసానికి కుట్ర లేపిన సైబర్ దొంగలు
ఇప్పటి వరకు లాటరీల పేరుతో, యాప్స్ పేరుతో లింకులు పంపింన స్కామర్లు ఇప్పుడు బ్యాంకుల పేరుతో నేరాలకు పాల్పడుతున్నారు. అచ్చం బ్యాంకులు పంపించినట్లుగానే కొత్త లింక్స్ వాట్సాప్ కు సెండ్ చేస్తున్నారు. తెలియక క్లిక్ చేస్తే ఫోన్ లోని డేటా అంతా కొల్లగొడుతున్నారు. అత్యంత ముఖ్యమైన బ్యాంక్ అకౌంట్స్, ఫోటోలు, వీడియోలను తస్కరిస్తున్నారు. క్షణాల్లో బ్యాంకుల్లోని డబ్బును కాజేస్తున్నారు.
కొత్త స్కామ్ ఎలా జరుగుతుందంటే?
వాట్సాప్ లో తాజా సంచలనం సృష్టిస్తున్న ఈ స్కామ్ ను అసలు సైబర్ నేరస్తులు ఎలా ఆపరేట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.. వాట్సాప్ కు ఎస్బీఐ లాంటి నేషనల్ బ్యాంకుల పేరుతో ఓ లింక్ ను పంపిస్తున్నారు. వారు పంపించే మెసేజ్ అచ్చం బ్యాంకులు పంపినట్లుగానే ఉంటాయి. బ్యాంక్ వివరాలు అంటూ చెక్ చేసుకోండి అంటూ apk ఫైల్ ను షేర్ చేస్తారు. చాలా మంది వాట్సాప్ వినియోగదారులు తమ బ్యాంకు వివరాలు చూసుకుందాం అనుకుని లింక్ ఓపెన్ చేస్తారు. అప్పుడు KYC వివరాలు అడుతుంది. మీరు ఆ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ ఆటోమెటిక్ గా హ్యాక్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ తో పాటు మీరు వాడే ఫోన్ లోని డేటా అంతా స్కామర్లకు యాక్సెస్ అవుతుంది. మీ UPI వివరాలు కూడా వారికి తెలిసిపోతాయి. మీ బ్యాంకు డీటైల్స్ యాక్సెస్ పొందిన 30 సెకెన్లలోనే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. మీ బ్యాంకులోని డబ్బులను కొట్టేయడంతో పాటు మీ ఫోన్ లోని సీక్రెట్ వివరాలను చేజిక్కించుకుని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి తలెత్తుతుంది. రీసెంట్ గా ఓ వ్యక్తికి ఇలాగే ఓ స్కామ్ మెసేజ్ వచ్చింది. ఆయన లింక్ ఓపెన్ చేసి KYC డీటైల్స్ ఎంటర్ చేసిన కాసేపటికే అకౌంట్ లోని రూ. 8 లక్షలు ఖాళీ అయ్యాయి.
స్కామర్ల నుంచి ఎలా తప్పించుకోవాలంటే?
వాట్సాప్ ద్వారా జరిగే సైబర్ నేరాలను అరికట్టాలంటే.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. బ్యాంకుల పేరుతో వచ్చే మెసేజ్ ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మెసేజ్ లను ఓపెన్ చేయకుండానే డిలీట్ చేయడం ఉత్తమం. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్ లు, అనుమానాస్పద మెసేజ్ లకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి మెసేజ్ ల గురించి అవగాహన కల్పించాలి. అప్పుడే సైబర్ నేరాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ 100 కోట్ల స్కామ్, రంగంలోకి దిగిన సీఐడీ