ISRO : శ్రీహరికోట నుంచి మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ – డీ2 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ఈవోఎస్ – 07, ఆజాదీశాట్ – 2, జానెస్ – 1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈవోఎస్ – 07 ఉపగ్రహం బరువు 156.3 కేజీలు. భూ పరిశోధనలకు ఈవోఎస్ – 07 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఆజాదీ శాట్ – 2 ఉపగ్రహాన్ని విద్యార్థులు రూపొందించారు. ఆజాదీ శాట్ -2 ఉపగ్రహం బరువు 8.7 కేజీలు. ఇక జానెస్ -1 అనేది అమెరికాకు చెందిన ఉపగ్రహం. దీని బరువు 10.2 కేజీలు. మొత్తం 3 ఉపగ్రహాలను నాలుగు దశల్లో 15 నిమిషాల వ్యవధిలోనే 450 కిలోమీటర్ల ఎత్తులోకి రాకెట్ తీసుకెళుతుంది. ఆ తర్వాత కక్ష్యలోకి ప్రవేశ పెడుతుంది. శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు ఎస్ఎస్ఎల్వీ – డీ2 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది.
ఎస్ఎస్ఎల్వీ – డీ2 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ తో కలిసి శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్కు అన్ని పరీక్షలను పూర్తి చేస్తున్నారు. ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోట షార్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాకెట్ ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్స్ల్స్ను పూర్తి చేస్తారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు.