Artificial Intelligence:– సైన్స్ అండ్ టెక్నాలజీ.. అందులోనూ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) లాంటివి ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదుగుతున్నాయి. అందుకే ప్రపంచ దేశాల దృష్టి మొత్తం వీటిపైనే ఉంది. ప్రస్తుతం చాలావరకు దేశాలన్నీ విడివిడిగానే ఏఐ లాంటి రంగాల్లో ఘనతను సాధించాలనుకుంటున్నాయి. అలాంటి సందర్భంలో యూఎస్ నుండి ఇండియాకు పిలుపు వచ్చింది. రెండు దేశాలు కలిసి ఏఐపై భారీ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ.. ఈ విభాగాలు అన్నింటిలో ప్రగతి సాధించడానికి అమెరికా, ఇండియా కలిసి పనిచేయనున్నాయి. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవే ముఖ్యమైన విభాగాలు. అందుకే వీటి విషయంలో పార్ట్నర్షిప్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న అంశాలను రెండు దేశాలు మంత్రులు కలిసి ఇటీవల చర్చించారు.
ఇండియాలో స్పేస్, బయోటెక్, స్టార్టప్స్ వంటి విభాగాల్లో కూడా సైంటిఫిక్ ఇన్నోవేషన్ అనేది పెరుగుతోంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇండియాతో చేతులు కలపడానికి ముందుకొస్తున్నారని ప్రభుత్వం గర్వంగా చెప్తోంది. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ (టిఐహెచ్) విషయంలో దాదాపు 35 జాయింట్ ప్రాజెక్ట్స్ గురించి మీటింగ్లో చర్చలు జరిగాయి. అందులో ఆరు టిఐహెచ్ జాయింట్ ప్రాజెక్ట్స్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్)తో కలిసి పనిచేయనున్నాయి.
ఇండియా, అమెరికా కలిసి చేస్తున్న క్లీన్ ఎనర్జీ అనే ఆర్ అండ్ డీ ప్రోగ్రామ్ గురించి కూడా మీటింగ్లో మాట్లాడుకున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఇండియా నుండి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికా నుండి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ చేతులు కలిపాయి. జియోలజీ విషయంలో కూడా ఇండియా, అమెరికా కలిసి పనిచేయడం కోసం ఒక మెమోరాండమ్పై సంతకం పెట్టాలనే ఆలోచనలో ఉన్నాయి. దీని ద్వారా జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, యూనైటెడ్ స్టేట్స్ జియోలజికల్ సర్వే డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయనున్నాయి.