Heat Waves:- వాతావరణ మార్పులు అనేవాటిని అంచనా వేయడం ఈరోజుల్లో మరీ కష్టంగా మారిపోయింది. పైగా ఇవి మానవాళిపై చూపించే ప్రభావం నుండి తప్పించుకోవడం కూడా కష్టంగా మారింది. వాతావరణ మార్పుల వల్ల మానవాళికి నష్టం కలగకుండా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. అవి వారి చేయిదాటిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈసారి మాత్రం దాదాపు 1 బిలియన్ మంది వేసవికాలంలో కష్టాలు అనుభవించక తప్పదని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఇండియాలో ప్రతీ సంవత్సరం వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు రికార్డ్ సాధిస్తూనే ఉన్నాయి. వాటి వల్ల మనుషుల ఎదుర్కుంటున్న ఇబ్బందులు కూడా ఎక్కువవుతూనే ఉన్నాయి. గతేడాది వడగాలుల వల్ల, వేడి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన ఎండ కారణంగా పంటలు కూడా నాశనమయిపోయాయి. ఉష్ణోగ్రతలు అనేవి మామూలు వాటికంటే 15 డిగ్రీల ఫారెన్హీట్ ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 115 డిగ్రీల ఫారెన్హీట్ను తాకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వేడిని తట్టుకోవడానికి జనాలు ఎలక్ట్రిసిటీని ఎక్కువగా వినియోగించడం మొదలుపెట్టారు. దాని వల్ల బొగ్గు ఉత్పత్తి కూడా ఎక్కువ జరగడం మొదలయ్యింది. ఇంత వేడి వాతావరణం వల్లే పంటలు నాశనమయిపోవడం, కార్చిచ్చులు సంభవించడం, అంతే కాకుండా మనుషుల ఆరోగ్యాలు కూడా క్షీణించడం జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. పైగా ఈ ఏడాది వేడి వాతావరణం వల్ల, ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు తీవ్ర ముప్పు ఉందని, ఎప్పటిలాగానే ఆ ముప్పును ప్రభుత్వాలు పట్టించుకోవని వారు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ఇండియా యొక్క జనాభా దాదాపు 1.4 బిలియన్. విపరీతమైన వేడి వాతావరణం వల్ల గతేడాది 90 శాతం ప్రజలు హార్ట్ఎటాక్, ఆరోగ్యకరమైన ఆహారం దొరకకపోవడం, మరికొందరు ఆ వేడిని తట్టుకోలేక చనిపోయారు కూడా. ఈ విషయాన్ని ఇటీవల చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా మరెన్నో రకాలుగా ఈ వడగాలులు, వేడి వాతావరణం అనేది ప్రజలను పీడిస్తుందని, దీనిని ప్రభుత్వాలు సీరియస్ తీసుకోవడం లేదని అన్నారు.
గత 30 ఏళ్లలో ఇండియాలో 24 వేల మంది వేడి వాతావరణం వల్ల మరణించారని స్టడీలో తేలింది. ఒకవేళ వాతావరణ మార్పులు అనేవి ఇంత తరచుగా మారకుండా ఉండుంటే ఉష్ణోగ్రత అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి రికార్డును సాధించేవి కాదని, ఇలాంటి రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు మామూలుగా 312 ఏళ్లకు ఒకసారి మారాల్సినవి, మూడేళ్లకు ఒకసారి మారుతున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే ఎంతైనా ఈ విషయంలో ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు.