Go Waterless : ఆవిష్కరణలకు మూలం అవసరాలే. ఇది ముమ్మాటికీ నిజం. పుణెకి చెందిన నితిన్ శర్మ విషయంలో జరిగింది కూడా ఇదే. అతను ఉంటున్న ప్రాంతంలో ఆరేళ్లు నీటిఎద్దడి ఎదురైంది. దైనందిన అవసరాలను మినహాయిస్తే.. మిగిలిన అన్ని విషయాల్లో నీటిని పొదుపు చేయాల్సిన పరిస్థితి. దాంతో కారును కడగకుండా రోజుల తరబడి అలాగే ఉంచేసేవాడు.
ఇళ్ల వద్ద పైపుతో కారును కడిగే పక్షంలో 80-90 లీటర్ల మేర నీటిని వాడాల్సిందే. పొదుపు చర్యల్లో భాగంగా బకెట్ నీటితో కడిగినా.. కనీసం 40 లీటర్లు తప్పవు. ఇక సర్వీస్ స్టేషన్ల సంగతి అంటారా? ఒక్కో కారు ఏకంగా 200 లీటర్లు తాగేస్తుంది. కారు వాషింగ్ కోసం ఇంత నీటిని వృధా చేయడం ఎందుకని నితిన్ శర్మకు తనను తానే ప్రశ్నించుకున్నాడు. వాటర్లెస్ వాషింగ్ ఆలోచనకు బీజం వేసింది కూడా అదే.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మన దేశం ఇప్పటికే నీటి సంక్షోభంలో చిక్కుకుంది. జనాభాలో దాదాపు 45% మంది నీటికి కటకటలాడే పరిస్థితులున్నాయి. భూగర్భజలాలు శరవేగంగా అడుగంటి పోతున్నాయి. 2030 నాటికి 40% జనాభాకు తాగునీరు కూడా కరువవుతుందని నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచబ్యాంక్ నివేదికల ప్రకారం చూసినా.. దేశ జనాభాలో కేవలం 6 శాతం మందికే నీటివనరులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
నీరు లేకుండా కార్లను వాష్ చేయగల ఫార్ములా కోసం నితిన్ అన్వేషిస్తుండగా.. అతని బంధువొకరు ఓ విషయం చెవిలో వేశారు. వాటర్లెస్ కార్ వాషింగ్ ప్రోడక్ట్ ఒకటి 2010లో అమెరికాలో అందుబాటులోకి వచ్చిందని నితిన్ దృష్టికి తెచ్చారు. అయితే దాని వల్ల ప్రయోజనం లేదని నితిన్ భావించాడు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ను ఉపయోగించడం వల్ల కారురంగు దెబ్బతింటోంది. అయితే ఆ ప్రోడక్ట్ ఫార్ములాను ఆధారంగా చేసుకుని.. స్క్రాచెస్ పడని విధానాన్ని కనుగొన్నాడు.
ఎంబీఏ డ్రాపౌట్ అయిన నితిన్.. ఈ విషయంలో కెమికల్ ఇంజనీర్ల సాయం తీసుకున్నాడు. భార్య క్షమా శర్మ, కుటుంబసభ్యుల తోడ్పాటుతో సమీకరించిన రూ.10 లక్షల మొత్తంలోనే కొంత భాగాన్ని పరిశోధనకు వెచ్చించాడు. 2017లో ప్లాంట్ బేస్డ్ లూబ్రికెంట్లతో స్ప్రేను అభివృద్ధి చేశాడు. నీటి అవసరం లేకుండానే కారుపై మురికిని ఈ లూబ్రిసిటీ స్ప్రే తొలగిస్తుంది. ఎకో-ఫ్రెండ్లీ అయిన ఈ ద్రవ పదార్థంతో కారు వాష్ సక్సెస్ కావడంతో నితిన్ ఇక ఆగలేదు.
తాను సమీకరించిన నిధులతో ముంబైలో సొంతంగా గో వాటర్లెస్ కార్ కేర్ సర్వీసెస్ను 2019లో ఆరంభించాడు. కార్వాష్ మార్కెట్ విలువ 2022లో 31 బిలియన్ డాలర్లుగా ఉంది. 2032 నాటికి ఇది 44 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. నీటి అవసరం లేకుండా కారువాష్ అంటే ఓ క్రేజ్ ఏర్పడింది. ఎకో-ఫ్రెండ్లీ.. నాన్-కరోజివ్ కావడంతో నితిన్ ప్రోడక్ట్ పెను విప్లవమే సృష్టించింది.
దీని తయారీకి అవసరమైన పదార్థాలు,మొక్కలను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో కారు వాష్కు దాదాపు 100 మిల్లీలీటర్ల స్ప్రే కావాలి. హైలూబ్రిసిటీ ఉన్న ఈ లిక్విడ్ను స్ప్రే చేసి.. తుడిచేస్తే చాలు. కారు వాష్, పాలిష్ ఏకకాలంలో పూర్తి అవుతాయి. నీటి కన్నా ఎక్కువగా, అతి వేగంగా డస్ట్ను తొలగించేస్తుంది. గో వాటర్లెస్ సంస్థ 175 ఫ్రాంఛైజీల్లో రోజుకు దాదాపు 8వేల కార్లను వాటర్ లేకుండానే శుభ్రం చేస్తున్నారు. వాటర్లెస్ కార్ వాష్ కాన్సెట్ ఇండియాకు కొత్తది కావడంతో నితిన్.. కారు ఓనర్లను ఆకట్టుకునేందుకు తొలినాళ్లలో రూ.99 మాత్రమే చార్ఝ్ చేశాడు.
ప్రస్తుతం కారు వెలుపల క్లీనింగ్కు రూ.199 వసూలు చేస్తుండగా.. మొత్తం సర్వీసింగ్ కు రూ.399 చార్జ్ చేస్తున్నారు. గో వాటర్లెస్లో తొలిసారి క్లీనింగ్కు 90 నిమిషాల సమయం పడుతుందని, తర్వాత క్లీనింగ్స్ 45 నిమిషాల్లోనే పూర్తవుతుందని నితిన్ వివరించాడు. 22 రాష్ట్రాల్లో విస్తరించిన గో వాటర్లెస్ వార్షికాదాయం 2.5 కోట్లు. 90 దేశాలకు తమ కంపెనీని విస్తరించాలని నితిన్ యోచిస్తున్నాడు. తన ప్రోడక్ట్ ద్వారా 3000 బిలియన్ల లీటర్ల నీటిని ఆదా చేయాలనేది అతని లక్ష్యం.