Eye-tracking technology : మాట్లాడకపోయినా మనసులోని మాటలను బయటపెట్టడం, కళ్ల కదలికలను బట్టి ఆలోచనలను చెప్పేయడం.. ఇలాంటి చాలా విషయాల్లో టెక్నాలజీని మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి ఓ కొత్త రకమైన టెక్నాలజీ మనుషులను పలకరించడానికి వచ్చేసింది.
ఒక అక్వేరియం ఎదురుగా నిలబడినప్పుడు మనిషి కళ్ల కదలికలను బట్టి తను ఏ చేపను చూస్తున్నాడో దాని పూర్తి వివరాలు కళ్ల ముందు కనిపించేలా టెక్నాలజీ ఏర్పాటయ్యింది. ఈ అక్వేరియంలలో కృత్రిమ మేధస్సును (ఏఐ) ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమయ్యింది. అక్వేరియంకు ఫిక్స్ చేసిన కెమెరాలు ముందుగా కళ్ల కదలికలను, ఆ తర్వాత చేపలను గమనిస్తాయి. ఆ తర్వాత మన కళ్లు ఏ చేప మీద పడుతుందో దాని వివరాలను చూపిస్తాయి.
అక్వేరియంతో మొదలైన ఈ ఐ ట్రాకింగ్ టెక్నిక్ టెక్నికల్ ప్రపంచంలో ఓ గేమ్ ఛేంజర్గా మారనుంది. అందుకే దీనికి ఏఐ అక్వేరియం అని పేరుపెట్టారు. తైవాన్లో ఈ ఏఐ అక్వేరియం ఆలోచనను పలు పరిశోధనల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ టెక్నాలజీ ద్వారా దాదాపు 98 శాతం వరకు చేపల వివరాలు కరెక్ట్గా వస్తాయని పరిశోధకులు అంటున్నారు.
ఏఐ అక్వేరియంలో మొత్తం రెండు కెమెరాలు అమర్చి ఉంటాయి. ఒక 3డీ కెమెరా ట్యాంక్పై అమర్చి ఉంటుంది. ఇది మనుషులు కళ్ల కదలికలను ట్రాక్ చేస్తుంది. ఇక రెండో కెమెరా చేపలపై దృష్టిపెట్టి ఉంటుంది. ఇందులోని డేటాబేస్లోనే అన్ని చేపల వివరాలు ఉంటాయి. కేవలం కళ్ల కదలికలనే కాదు చేతి కదలికలను కూడా కెమెరాలు గుర్తించగలవని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏఐ అక్వేరియం తైవాన్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పొందుపరిచి ఉంది.
Follow this link for more updates:- Bigtv