New Twitter CEO:- ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్ అనేవి మనుషులకు అత్యవసరంగా మారిపోయాయి. అంతే కాకుండా కొంతమంది యువతకు అయితే ఆ సోషల్ మీడియా యాప్స్ను ఎవరు తయారు చేశారు, ప్రస్తుతం వాటిని ఎవరు శాసిస్తున్నారు అనే విషయాలపై కూడా ఆసక్తి పెరిగింది. అందుకే ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ కూడా మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం ట్విటర్ సీఈఓగా ప్రమాణ స్వీకారం చేసిన ఎలన్ మస్క్ తాజాగా ఒక నిర్ణయంతో అందరికీ షాకిచ్చాడు.
చాలాకాలం టెస్లా అధినేత ఎలన్ మస్క్కు ట్విటర్పై కన్ను ఉంది. అందుకే ట్విటర్ను కొనాలనుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తర్వాత ఆ వార్తలే నిజమయ్యాయి. ఎవరూ ఊహించని భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టి ట్విటర్ను కొన్న మస్క్.. ఆ తర్వాత తనే సీఈఓగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పి అందరికీ మరొక షాకిచ్చాడు. ప్రస్తుతం సీఈఓ తను కాదని.. ఎన్బీసీ యూనివర్సల్ ఛైర్మన్ లిండా యాక్కరినో ట్విటర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారని ప్రకటించారు.
ఇప్పటివరకు ట్విటర్ కేవలం ఒక సోషల్ మీడియా యాప్. అలా కాకుండా ఈ యాప్ అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలని ఎలన్ మస్క్ భావించాడు. అందుకే లిండాను సీఈఓ సింహాసనం ఎక్కిస్తున్నాడని టెక్ ప్రపంచంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపై లిండా బిజినెస్ ఆపరేషన్స్పై దృష్టిపెడుతుందని, తాను ప్రొడక్షన్ డిజైన్తో పాటు కొత్త టెక్నాలజీను చూసుకుంటానని మస్క్ ట్వీట్ చేశాడు. ట్విటర్ను ఎవ్రీథింగ్ యాప్గా మార్చాలని లిండాతో కలిసి పనిచేస్తున్నాని తెలిపాడు.
లిండా సీఈఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలన్ మస్క్ ట్విటర్కు ఎగ్జిక్యూటివ్ ఛైర్గా, సీటీఓగా మారనున్నాడు. లిండా కింద దాదాపు 2000 మంది ఉద్యోగులు పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లిండా.. యాపిల్, స్నాప్చాట్, యూట్యూబ్ లాంటి సంస్థల్లో భాగస్వామిగా ఉంది. ఇదంతా చూస్తుంటే కొన్నాళ్ల క్రితం ‘నేను సీఈఓ ఛైర్ నుండి తప్పుకోవాలా’ అని మస్క్ చేసిన ట్వీట్ గుర్తొస్తుంది అంటున్నారు నెటిజన్లు. అప్పుడు అదంతా ఫన్నీగా తీసుకున్నా మస్క్ మాత్రం నిజంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.