Blood cancer:- క్యాన్సర్ అనేది ఒకప్పుడు మాత్రమే కాదు ఇప్పటికీ ప్రాణంతక వ్యాధిగానే ఉంది అని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ పెరిగి అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్సలు అందుబాటులో ఉన్నా కూడా క్యాన్సర్ సోకిన పేషెంట్ చికిత్స తర్వాత కూడా బ్రతుకుతాడన్న గ్యారంటీని వైద్యులు ఇవ్వలేకపోతున్నారు. అందుకే ముందస్తు చర్యలు తీసుకోవడం క్యాన్సర్ను ట్రీట్ చేయడానికి మెరుగైన మార్గమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
క్యాన్సర్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. అది ఎందుకు, ఎలా వస్తుంది అనే క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేకపోయారు. అలాంటి వాటిలో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే భవిష్యత్తులో బ్లడ్ క్యాన్సర్ రాకుండా ఉండే ఒక కొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. మనిషిలో ఉండే ప్రొక్యాన్సరస్ సెల్స్ను మెరుగుపరచడం వల్ల భవిష్యత్తులో బ్లడ్ క్యాన్సర్ వల్ల పేషెంట్లు ఇబ్బంది పడే అవకాశం చాలావరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త విధానాన్ని పేసర్ అని అంటారు. అయితే ఈ ప్రక్రియలో క్లోనల్ వ్యాప్తి చెందుతున్నప్పుడు కొత్త జీన్ తయారవ్వడాన్ని వారు గమనించారు. ఈ జీన్ను ఉపయోగించి వారు తయారు చేసే టీసీఎల్ 1ఏ అనే డ్రగ్ క్లోనల్ పెరుగుదలను, క్యాన్సర్ను అరికట్టడానికి ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ను అరికట్టడానికి టీసీఎల్ 1ఏ ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు.
వయసు పైబడిన వారిలో 10 శాతం మంది రక్తంలో అనవరసరమైన క్లోనల్స్ పెరిగిపోవడం, బ్లడ్ స్టెమ్ సెల్స్లో మ్యూటేషన్స్ జరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్ బారినపడతారు. ఇలా జరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్తో పాటు అనేక గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని వారు చెప్తున్నారు. బ్లడ్ క్యాన్సర్కు, మరెన్నో ఇతర సమస్యలకు కారణమవుతున్న క్లోనల్ వ్యాప్తి గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా స్టడీ చేయడం మొదలుపెట్టారు.
బ్లడ్ క్యాన్సర్ను ముందస్తుగానే కనిపెట్టడం కోసం, అరికట్టడం కోసం వైద్యులు.. పేషెంట్ల బ్లడ్ శాంపిల్స్ను ఎంతో ముందుగానే సేకరించి పెడతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాటిపై ప్రయోగాలు మొదలుపెడతారు. ముందుగా క్లోన్ అనేది రక్తంలో ఎప్పుడు ఫార్మ్ అయ్యిందో కనిపెట్టగలిగితే.. అది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి పేసర్ టెక్నిక్ ఉపయోగపడుతుందని అన్నారు. క్యాన్సర్ను అరికట్టాలనే లక్ష్యంతో ఈ పరిశోధన ముందుకెళ్తుందని వారు బయటపెట్టారు.