Sunitha Williams In Space| రెండు నెలల క్రితం అంతరిక్షంలో ఒక మిషన్ కోసం బయలుదేరిన ఇద్దరు వ్యోమగాములు (ఆస్ట్రోనాట్ లు) అక్కడే చిక్కుకున్నారు. 8 రోజుల్లో మిషన్ పూర్తి చేసి తిరిగి భూమి చేరుకోవాల్సిన వారిద్దరూ స్పేస్క్రాఫ్ట్ (అంతరిక్ష విమానం) పనిచేయకపోవడంతో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వారిద్దరూ మరో 6 నెలల వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఒకరి ఆరోగ్యం క్షీణిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. భారతీయ మూలాలున్న సునీతా విలియమ్స్ (58) ఒక ప్రముఖ ఆస్ట్రోనాట్. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కోసం అమె ఎన్నో సార్లు అంతరిక్ష పర్యటన చేశారు. ఎన్నో అంతరిక్ష మిషన్ లు పూర్తి చేశారు. అయితే జూన్ 5న ఆమెతోపాటు కమాండర బ్యారీ విల్ మూర్ (61) అనే ఆస్ట్రోనాట్.. అంతరిక్షంలో ఒక 8 రోజుల మిషన్ కోసం వెళ్లాడు. ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్.. తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అనే అంతరిక్ష విమానంలో వారిద్దరూ ప్రయాణించారు. అయితే బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి ప్రయాణం చేయడం.. ఇదే తొలిసారి కావడం గమనార్హం.
స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని బోయింగ్ విమాన తయారీ సంస్థ సాధారణ ప్రజల కోసం తయారు చేసినట్లు ప్రకటించింది. అందుకే స్టార్ లైనర్ ని అంతరిక్ష ప్రయాణంలో టెస్టు చేయడానికి సునీతా విలియమ్స్, బ్యారీ విల్ మూర్ ఇద్దరూ బయలుదేరారు. అంతరిక్షంలో స్టార్ లైనర్ ఏ సమస్య లేకుండా ప్రయాణం చేయగలదా? అని పరీక్షలు చేస్తూ.. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు వెళ్లారు. కానీ గమ్యానికి చేరువలో ఉండగా.. ఇంధనం (హీలియమ్) లీకేజీ సమస్య ఎదురైంది. దీంతో ఎలాగోలా వారిద్దరూ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు చేరుకున్నారు. ఆ తరువాత స్టార్ లైనర్ లో వచ్చిన సమస్యలను గమనిస్తే.. అందులో ఇంధనం లీకేజీతో పాటు అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ ఎగరడానికి ఉపయోగపడే థ్రస్టర్స్ పనిచేయడం లేదు. ప్రొపెల్ వాల్వ్స్ కూడా ఆగిపోయాయి.
ఈ కారణంగా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూ గ్రహానికి చేరుకోవడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో నాసా కమర్షియల్ క్రూ ప్రొగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ స్పందించారు. ” సునీతా, బ్యారీ ఇద్దరినీ తిరిగి స్టార్ లైనర్ ద్వారానే భూమికి తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకవేళ అలా కుదరకపోతే వారిని తీసురావడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం” అని తెలిపారు.
మరోవైపు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాములకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రెండు నెలలుగా స్పేస్ లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఆమెకు కంటి చూపు క్షీణిస్తోంది. ఎక్కువగా అంతరిక్ష ప్రయాణం చేసేవారికి న్యూరో ఒకులార్ సిండ్రోమ్ అనే సమస్య ఎదురవుతుంది. దీని వల్ల మనిషి కంటిచూపు క్షీణిస్తుంది. ఇప్పుడు ఇదే ఆరోగ్య సమస్య సునీతా విలియమ్స్ కు ఎదుర్కొంటోందని.. దీనికి కారణం అంతరిక్షంలో ఉన్నప్పుడు మైక్రోగ్రావిటీ వల్ల జరుగుతుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. పైగా సునీతా విలియమ్స్ శరీర ఎముకల బలం కూడా తగ్గిపోతోందని తెలిసింది. ఆమె ఎముకల్లో సాంధ్రత తగ్గిపోయిందని మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సునీతా విలియమ్స్ మరో ఆరు నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ లో వచ్చిన టెక్నికల్ సమస్యలను పరిశీలిస్తోంది. దీనికి మరింత సమయం కావాలని నాసాను కోరినట్లు సమాచారం.
Also Read: 13 ఏళ్లుగా భార్య కోసం గాలింపు.. అతడి ఎదురుచూపు వెనుక అంతుచిక్కని విషాదం