Rains : కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మండువేసవిలో వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలు తగ్గితే ఎండ దంచేస్తోంది. తెలంగాణలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దక్షిణ దిశ నుంచి గాలులు తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో కొనసాగుతోందని వివరించింది. సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉందని తెలిపింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది. ఇది ఈ నెల 9న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత దాదాపు ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రం వైపునకు కదులుతూ తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది. అల్పపీడనంగా మారిన తర్వాత ఈ తుపాను దిశ, వేగం, తీవ్రత, ప్రయాణించే మార్గం తెలుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణలో ఈ నెల 9న తేదీ నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లో 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది.