దీపావళికి ఏపీ ప్రభుత్వం కానుక ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అదేనండీ ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం దీపావళి కానుకకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.
పేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండదండగా నిలిచేందుకు, ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నట్లు, ఈ సిలిండర్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఈనెల 24వ తేదీ నుండే ప్రారంభించాలని సీఎం, అధికారులకు ఆదేశించారు.
అలాగే ఈనెల 31వ తేదీ దీపావళి నుండి గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకొని లబ్ధిదారులు మాత్రం తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో గ్యాస్ సిలిండర్ తీసుకున్న రెండు రోజుల్లోనే గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని, ఆలస్యం చేయవద్దని సీఎం సూచించారు.
దీనితో లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖాతాను కలిగి ఉండని పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ జమకావడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అర్హత గల ప్రతి లబ్ధిదారునికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో దీపం పథకం ద్వారా పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు.
కాగా దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీతో.. ప్రభుత్వానికి రూ.2684 కోట్ల రూపాయల భారం పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ తెలిపారు.
దీపం పథకం అమలుతో, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరినట్లేనని చెప్పవచ్చు. అయితే మహిళలకు ఫ్రీ బస్ హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.