Zomato : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో సేవలు నిలిపివేసింది. గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతం ఉన్న కారణంగా ఆయా నగరాల్లో ఫుడ్ డెలివరీ ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నగరాల్లో వ్యాపారం ప్రోత్సాహకరంగా లేదని స్పష్టం చేసింది. సేవలు నిలిపివేసిన నగరాల జాబితాను మాత్రం జొమాటో వెల్లడించలేదు.
225 నగరాల్లో వ్యాపారం నిలిపివేయడం వల్ల తమ కంపెనీ వ్యాపార వృద్ధిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చునని జొమాటో పేర్కొంది. కంపెనీ దీర్ఘకాల లక్ష్యాలను అందుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. అందువల్ల ఆయా నగరాల్లో వ్యాపారం నిలిపివేశామని తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జొమాటో రూ.346.6 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత అక్టోబర్ నుంచి ఫుడ్ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగడమే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేసింది. దీని ప్రభావం ప్రధానంగా 8 నగరాల్లో ఎక్కువగా ఉందని పేర్కొంది.
మరోవైపు గతేడాది చివరి రెండు నెలల్లో పనితీరు ఆధారంగా సంస్థలో 3 శాతం సిబ్బందిని జొమాటో తొలగించింది. ఇప్పుడు 225 నగరాల్లో సేవలు నిలిపివేయడం వల్ల మరికొంత మంది ఉపాధి కోల్పోతున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని గత నెలలో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ప్రకటించారు. వివిధ విభాగాల్లో 800 మందిని తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఆ సంస్థే 225 నగరాల్లో సేవలు బంద్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.