Karnataka Governor Thaavar Chand Gehlot gets Z+ Security : కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు సెంటర్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ – సీఆర్పీఎఫ్ ద్వారా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే, గవర్నర్ కు అత్యవసరంగా భద్రతను పెంపు విషయమై నిర్దిష్టమైన కారణాలను మాత్రం బహిరంగంగా పేర్కొనలేదు. కాగా, ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతిపై ముడా కుంభకోణం విషంయలో దర్యాప్తునకు గెహ్లాట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలోనే ఆయనకు భద్రతను పెంచి ఉండవచ్చని చెబుతున్నారు.
కేంద్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఇటీవలే భద్రతాపరమైన ముప్పును అంచనా వేసిన తరువాత, ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసిందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. గెహ్లాట్ కానీ, ఇతర ఏ గవర్నర్లు కూడా ఇంతుకుముందెప్పుడూ జెడ్ + కేటగిరీ భద్రతను కోరలేదు.
Also Read: గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?
గవర్నర్ గెహ్లాట్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బందితో కూడిన బృందం షిఫ్టులలో ఆయనకు భద్రతగా ఉండనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో గెహ్లాట్ కు బుల్లెట్ ప్రూఫ్ ఎస్ యూవీ వాహనాన్ని అందించింది. సెక్యూరిటీని కూడా పెంచింది. అయితే, ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించడంతో ఆయనకు ఇక నుంచి పూర్తిగా సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో భద్రత కొనసాగనున్నది.
ముడా కుంభకోణంలో విషయంలో గవర్నర్ విచారణకు ఆదేశాలిచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఓ నేతకు కూడా బంగ్లాదేశ్ తరహాలు ఇక్కడ కూడా ఆందోళనలు తప్పవని బహిరంగంగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. గెహ్లాట్ వయసు 76 సంవత్సరాలు. ఆయన కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా 2021 జులై నెలలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఈయన మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి.
కాగా, ముడా కుంభకోణం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మైసూరు శివారుల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఆ భూములను అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వారిని నుంచి సేకరించింది. అందుకు బదులుగా నగరంలోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకునే దట్టగల్లీ, విజయనగర్, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో వారికి భూములను కేటాయించింది. 50:50 నిష్పత్తిలో ఆ భూములను కేటాయించింది. ఈ నేపథ్యంలో రగడ నెలకొన్నది. సిద్ధు కుటుంబానికి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి. కేబినెట్ అనుమతి లేకుండా ఎలా అత్యంత ఖరీదైన భూములను వారికి అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇదంతా జరిగిందా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఆరోపణలు భారీగా వస్తున్న నేపథ్యంలో గవర్నర్ గెహ్లాట్ విచారణకు ఆదేశించిన విషయం విధితమే.