Waiting Ticket: మన దేశంలో రైల్వే వ్యవస్థ ద్వారా ప్రతి రోజు సుమారు 2.4 కోట్ల మంది ప్రయాణం చేస్తుంటారు. ఇందులో చాలా మంది వెయిటింగ్ టికెట్ ద్వారానే ఎలాగోలా తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. భారత రైల్వే శాఖ తీసుకున్న కొత్త నిర్ణయాలతో వీరికి మరిన్ని తిప్పలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే వెయిటింగ్ టికెట్లున్నవారిని రిజర్వ్డ్ కోచ్లలోకి రానివ్వడం లేదు. ఒక వేళ వెయిటింగ్ టికెట్తో స్లీపర్స్, ఏసీ వంటి రిజర్వ్డ్ బోగీల్లో టీటీకి దొరికారో.. వారిని నెక్స్ట్ స్టేషన్లో దింపేయడమే కాదు.. ఫైన్ కూడా వేస్తారు.
కోట్లాది మంది రైల్వే ప్రయాణికులను ప్రభావితం చేసే నిర్ణయాన్ని భారత రైల్వే శాఖ తీసుకున్నది. వెయిటింగ్ టికెట్కు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయాలు జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఒక వేళ ఈ నిబంధనను ప్రయాణికులు ఉల్లంఘిస్తే వారిని మధ్యలోనే దింపేయడమే కాదు.. పెనాల్టీ కూడా విధిస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే రిజర్వేషన్ కోచ్లలో వెయిటింగ్ టికెట్లను మొత్తంగా బ్యాన్ చేసింది. మీ టికెట్ వెయిటింగ్లోనే ఉంటే మీరు ఏసీ లేదా స్లీపర్ కోచ్లలో ప్రయాణించలేరు. ఆ వెయిటింగ్ టికెట్ను మీరు ఆఫ్లైన్లో స్టేషన్లోనే కొనుగోలు చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది. కన్ఫర్మ్డ్ టికెట్ ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాము కన్ఫర్మ్డ్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తున్నా వెయిటింగ్ టికెట్లతో కోచ్ మొత్తం ప్రయాణికులు నిండిపోయి ప్రయాణం కష్టతరంగా మారుతున్నదని రైల్వే శాఖకు ఫిర్యాదులు పోటెత్తాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ వెయిటింగ్ టికెట్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు ఎలా ఉన్నది?
ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లో వెయిటింగ్ టికెట్ తీసుకున్న వారు రిజర్వ్డ్ కోచ్లలో కూడా ప్రయాణించడానికి అవకాశం ఉండేది. వెయిటింగ్ టికెట్ ద్వారా స్లీపర్, ఏసీ కోచ్లలో కూడా ప్రయాణించేవారు. అయితే, ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో వెయిటింగ్ టికెట్ కొనుగోలు చేసిన వారి ప్రయాణాలపై నిషేధం ఇది వరకే ఉన్నది. వారి టికెట్ కన్ఫార్మ్ కాకపోతే వెంటనే క్యాన్సిల్ అయిపోయి.. నగదు రిఫండ్ అవుతుంది. ఇప్పుడు ఇదే రూల్ రైల్వే స్టేషన్లలో విండో కౌంటర్ టికెట్లకు కూడా వర్తిస్తోంది. కాబట్టి, పాత అలవాటుతో వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రైలు ఎక్కి ఇబ్బందులు తెచ్చుకోవద్దు.
రైల్వే శాఖ ఏమంటున్నది?
వెయిటింగ్ టికెట్లపై ప్రయాణాలను బ్రిటీష్ కాలంలోనే నిషేధించారని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ, ఆ నిబంధనలను ఇప్పటి వరకు కచ్చితత్వంతో అమలు చేయలేదని, ఇకపై ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. మీరు రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ టికెట్ కొనుగోలు చేసినా.. అది వెయిటింగ్లోనే ఉంటే దాన్ని రద్దు చేసుకుని డబ్బులు వెనక్కి తీసుకోవాలని కొత్త రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఫైన్ ఎంత?
మీరు వెయిటింగ్ టికెట్ పై ఏసీ కోచ్లో ప్రయాణిస్తే రూ. 440 పెనాల్టీతోపాటు నెక్స్ట్ స్టేషన్కు అయ్యే చార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదే వెయిటింగ్ టికెట్ పై స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే రూ. 250 పెనాల్టీతోపాటు తదుపరి స్టేషన్కు అయ్యే చార్జీని చెల్లించాలి.
వెయిటింగ్ టికెట్స్ కొనుగోలు చేసిన వారు.. ట్రైన్ డిపార్చర్కు అరగంట ముందే ఆ టికెట్స్ను రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ రవాణా మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమమని అధికారులు సూచనలు చేస్తున్నారు.