Wrestlers : భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా రెజ్లర్లు తగ్గేదేలేదంటూ నిరసన తెలుపుతున్నారు. వారిని శాంతింప జేసేందుకు స్వయంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. భజ్రంగ్ పునియా, రవి దహియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ లాంటి అగ్రశ్రేణి అథ్లెట్లతో తన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు చర్చలు జరిపారు. ఆరోపణలపై రెజ్లింగ్ సమాఖ్య నుంచి వివరణ వచ్చే వరకు వేచి చూడాలని రెజ్లర్లకు సూచించారు. ఆందోళనలు విరమించాలని కోరారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయడంతోపాటు రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాల్సిందేనని రెజ్లర్లు పట్టుబట్టారు. అప్పటివరకు నిరసన విరమించేది లేదని తేల్చిచెప్పారు. చర్చలు ఫలించకపోవడంతో మూడోరోజు నిరసనలు కొనసాగిస్తున్నారు.
రెజ్లర్ల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి స్పందించారు. అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని ఫేస్ బుక్ పోస్టులో స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మహిళా రెజ్లర్ల మర్యాదకు భంగం కలిగిస్తూ రెజ్లింగ్కు వ్యతిరేకంగా కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బ్రిజ్ భూషణ్ 24 గంటల్లోపు రాజీనామా చేయాలని కేంద్ర క్రీడలశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్రీడలశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నెల 22న రెజ్లింగ్ సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో బ్రిజ్ భూషణ్ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.