ఢిల్లీలోని సుల్తాన్పురిలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన భర్త కుడి చెవిని కొరికింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు భార్యపై కేసు నమోదు చేశాడు. తన కుడి చెవి పైభాగం ఛిద్రమైందని, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 20 ఉదయం గ. 9.20 సమయంలో ఇంట్లోని చెత్త పడేయడానికి బయటకు వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేయాలని చెప్పినా ఆమె పట్టించుకోకుండా.. అకారణంగా తనతో గొడవ పడిందన్నాడు. ఇల్లు అమ్మి సగం వాటా ఇస్తే పిల్లలతో వేరు కాపురం పెడతానని డిమాండ్ చేసిందని వాపోయాడు.
తనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినకుండా చిన్న గొడవని పెద్దగా చేస్తుందని ఆమెను పక్కకు నెట్టి బయటకు వెళ్తుండగా వెనక నుంచి వచ్చి కుడి చెవిని బలంగా కొరికిందని పోలీసులకు వివరించాడు. చికిత్స కోసం తన కొడుకు హాస్పిటల్కు తీసుకెళ్లాడని, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవంబర్ 20న ఈ ఘటనపై ఆసుపత్రి నుంచి సమాచారం సేకరించి దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. చికిత్స అనంతరం నవంబర్ 22న భర్త వచ్చి తమకు ఫిర్యాదు చేయగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి వివరించారు.