Wineshops Close : జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరగనుంది. యావత్ దేశమంతా ఎదురుచూస్తోన్న ఈ వేడుకకు అయోధ్య నగరి ముస్తాబవుతోంది. రామయ్యకు దేశనలుమూలల నుంచి కానుకలొస్తున్నాయి. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశప్రజలంతా ఆ రోజున ఇంట్లో దీపాలు వెలిగించి.. దీపావళిని జరుపుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ఈ క్రమంలో జనవరి 22న అయోధ్య సహా.. ఉత్తరప్రదేశ్ మొత్తం మద్యంతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా డ్రై డేను ప్రకటించాయి.
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా రామమందిర ప్రారంభోత్సవం రోజున డ్రై డే ప్రకటించారు. జనవరి 22న రాష్ట్రంలో పబ్బులు, మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి అయోధ్యకు 300 మెట్రిక్ టన్నుల సువాసన గల బియ్యాన్ని పంపనున్నారు.
అస్సాం, జైపూర్ లలోనూ అక్కడి ప్రభుత్వాలు డ్రై డే ప్రకటించాయి. జైపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెరిటేజ్ ఏరియాల్లో జనవరి 22న మాంసం దుకాణాలను మూసివేయనున్నారు. హెరిటేజ్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని స్థానిక బీజేపీ నాయకుడు గోపాల్ శర్మ డిమాండ్ చేయగా.. ఆ ప్రతిపాదనను మేయర్ మునేష్ గుజ్జర్ తిరస్కరించారు.