Sonia Gandhi’s letter to Rae Bareli : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ తన నియోజక వర్గమైన రాయబరేలీ వాసులకు నేడు ఒక లేఖ రాశారు. నేడు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా.. ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరించిన రాయబరేలీ వాసులను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. రాయ్బరేలీతో మా కుటుంబానికి ఉన్న బంధాన్ని మాటల్లో చెప్పలేను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో మీరు మా మామగారైన ఫిరోజ్ గాంధీని మీ ప్రతినిధిగా లోక్సభకు పంపారు. ఆ తర్వాత మా అత్తయ్య ఇందిరా గాంధీనీ మీరు మీ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఊహించని పరిస్థితిలో నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత నేను రాయబరేలీ రావాల్సివచ్చింది.
ఆ కష్టకాలంలో మీరంతా నన్ను మీ మనిషిగా అక్కున చేర్చుకున్నారు. నన్ను రెండు సార్లు మీ ప్రతినిధిగా ఎంచుకుని లోక్సభకు పంపారు. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి రాయబరేలీ వాసులైన మీరే కారణం. ఈ కాలంలో నేను నా వంతుగా మీరు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాను. పెరుగుతున్న నా వయసు, ప్రస్తుత నా ఆరోగ్య పరిస్థితి కారణంగా నేను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నాను.
read more : మోదీ దొంగాటకు సుప్రీం చెక్..!
ఈ విషయం నాకు బాధ కలిగించినా.. నా మనసు మీతోనే ఉంటుంది. ఇప్పటివరకు అనేక విధాలుగా మా కుటుంబానికి అండగా నిలిచిన మీరంతా రాబోయే రోజుల్లోనూ ఇదే రీతిన మాకు అండగా నిలుస్తారని నాకు తెలుసు. త్వరలోనే వచ్చి మిమ్మల్ని తప్పక కలుస్తాను’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాయబరేలీ నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ప్రియాంక గాంధీ తొలిసారి పోటీ చేయనున్న స్థానంగా రాయబరేలీ నిలవనుంది. ఆది నుంచి గాంధీ కుటుంబానికి పట్టున్న ఈ స్థానం నుంచే ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా నడిచినా, యూపీలో అది మరింత ప్రబలంగా కనిపించినా.. రాయబరేలీలో మాత్రం సోనియా గెలిచి సత్తా చాటారు.