Republic Day Parade : మనదేశం రేపు 75వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకోనుంది. ఇందులో భాగంగా మన సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా కర్తవ్య పథ్లో గొప్ప పెరేడ్ కూడా జరగనుంది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉండే 3 కి.మీ పొడవున ఉండే ఈ కర్తవ్యపథ్లోనే 1950 నుంచి ఈ పెరేడ్ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కర్తవ్య పథ్కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అక్కడే పెరేడ్ ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం.
మనదేశాన్ని పాలించిన బ్రిటిషర్లకు 1911లో దేశ రాజధానిని మార్చాలనే ఆలోచన వచ్చింది. అప్పటివరకు బెంగాల్ రాజధానిగా ఉన్న కోల్కత్తా(అప్పట్లో కలకత్తా) దేశ రాజధానిగా ఉండేది. దీంతో అత్యున్నత స్థాయి బ్రిటిష్ అధికార యంత్రాంగం అంతా అక్కడే నివసించేది. అయితే.. 1857 తిరుగుబాటు, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన వందేమాతర ఉద్యమం సందర్భంగా కోల్కతాలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల.. ఇది సురక్షితమైన రాజధాని కాదనే అంచనాకు వచ్చిన బ్రిటిషర్లు.. ఢిల్లీని రాజధానిగా ఎంచుకున్నారు.
ఢిల్లీలోని వసతుల గురించి ఆరా తీసేందుకు వచ్చిన బ్రిటన్ అధికారులు.. నాటి మొఘలుల కాలం నాటి నిర్మాణాలు, వాటిలోని వసతులు చాలవని భావించి, పాత ఢిల్లీకి కాస్త దూరంగా కొత్త ఢిల్లీ నగరాన్ని నిర్మించాలని భావించారు. అక్కడ సకల సదుపాయాలున్న భవనాన్ని నిర్మించ తలపెట్టారు. అలా నేటి రాష్ట్రపతి భవన్ నిర్మాణానికి పూనుకున్నారు. అప్పట్లో దీనిని వైస్రాయ్ హౌస్ అనేవారు. దీనికి ఎడ్వర్డ్ లుటియెన్స్ ఆర్కిటెక్ట్గా పనిచేయగా, హగ్ కీలింగ్ చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు.
వైస్రాయ్ సాయంకాలపు నడకకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో 1920లో ఓ రోడ్డును నిర్మించారు. రాష్ట్రపతి భవన్ నిర్మాణానికి అధికారికంగా అనుమతినిచ్చిన కింగ్ జార్జ్ 5 జ్ఞాపకార్థం దీనికి కింగ్స్ వే అనే పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిపేరు రాజపథ్గా మారింది. మోదీ సర్కారు వలసవాద, సామ్రాజ్యవాద ఆలోచనల్ని ప్రతిబింబించే చిహ్నాలను తొలగించాలనే నిర్ణయంలో భాగంగా దీని పేరును కర్తవ్య పథ్గా మార్చారు. అలా ఒకనాడు బ్రిటిష్ పాలనకు గుర్తుగా ఉన్న కింగ్స్ వే కాలక్రమంలో ‘కర్తవ్య పథ్’గా మారి సాధికారతకు గుర్తుగా నిలుస్తోంది.
కొత్త పార్లమెంటు సెంట్రల్ విస్టా అవెన్యూలో భాగంగా ఒకప్పుడు సాదాసీదాగా ఉండే కర్తవ్య పథ్ను ఆధునీకరించారు. దారి పొడవునా వివిధ రాష్ట్రాల ఆహారపు స్టాళ్లు, ఎర్రటి గ్రానైట్ వాక్ వేలు, పార్కులు, దుకాణాలు, పార్కింగ్ సదుపాయాలు, చిన్న చిన్న వంతెనలు ఏర్పాటు చేశారు.