Bengaluru: గోవాలో తన నాలుగేళ్ల కొడుకుని చంపి.. మృతదేహాన్ని బ్యాగులో ఉంచి.. కర్ణాటకకు తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్ పుల్ ఏఐ సంస్థ సీఈఓ సుచనా సేఠ్ కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. భర్త వెంకటరామన్.. తన కొడుకుతో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారి తీసిందని గోవా పోలీసులు తెలిపారు.
సుచనా సేఠ్ – వెంకటరామన్ ల విడాకుల ప్రక్రియ 2022లో మొదలైంది. ఈ క్రమంలో వారి కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్నదానిపై వాదనలు జరగ్గా.. ప్రతి ఆదివారం తండ్రి కొడుకుతో సమయం గడిపేందుకు కోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులతో సుచనా సేఠ్ తీవ్ర నిరాశకు గురైంది. వెంకటరామన్ కు కొడుకును దగ్గర కానివ్వకూడదన్న ఆలోచనతోనే.. అతడిని చంపాలని నిర్ణయించుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సుచనాను మరింత లోతుగా విచారణ చేసేందుకు గోవా కోర్టు 6 రోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగించింది.
చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందు ఇచ్చి.. తలదిండు లేదా టవల్ తో బాలుడి గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హోటల్ రూమ్ లో తనిఖీలు చేయగా.. ఒక చిన్న, పెద్ద దగ్గుమందు సీసాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. కానీ.. సుచనా సేఠ్ మాత్రం తాను నిద్రనుంచి లేచేసరికే కుమారుడు చనిపోయి ఉన్నాడని చెబుతుందన్నారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తండ్రికి అప్పగించగా.. ఆయన బెంగళూరులోని ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు.
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యుడు కుమారనాయక్ మాట్లాడుతూ.. బాలుడికి గుండెభాగంలో వాపు వచ్చిందని, ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తెలిపారు. ఆదివారమే బాలుడిని చంపి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.