Ajit Pawar Shivaji Statue Protest| మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ విగ్రహ రాజకీయాలు ప్రభుత్వంలో చీలిక తీసుకొచ్చాయి. గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కింపబడిన ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల విగ్రహం ఇటీవల భారీ వర్షాలు, గాలివానకు కూలిపోయింది. దీంతో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం విగ్రహం తయారీ అవినీతికి పాల్పడిందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాయుతి కూటమిలో బిజేపీ, ఏక్ నాథ్ శివసేన తో పాటు అజిత్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది.
ప్రభుత్వంలో భాగస్వాములైన బిజేపీ, ఏక్ నాథ్ శివసేన పార్టీలు ఈ వివాదంపై రాజకీయాలు చేయవద్దని చెబుతున్న తరుణంలో మూడో భాగస్వామి అయిన అజిత్ పవార్ పార్టీ మాత్రం ఇది చాలా బాధాకరమైన ఘటన అని, చెబుతూ విగ్రహ తయారీలో అవినీతి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని గురువారం ఆగస్టు 29న తెలిపింది.
ఎన్సీపీ ముంబై అధ్యక్షుడు సమీర్ భుజ్ బల్ నాయకత్వంలో కార్యకర్తలు చెంబూర్ ప్రాంతంలో ఈ రోజు నిరసనలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ నిరసనలపై లాతూర్ జిల్లాలో జరిగిన బహిరంత సభలో బుధవారం మాట్లాడుతూ.. విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర ప్రజలకు చాలా బాధాకరం. ”ఛత్రపతి శివాజీ మహరాజ్ మాకు దేవుడు. ఆయన విగ్రహం ఆవిష్కరించిన ఏడాదిలోపే కూలిపోవడం మనందరికీ షాకింగ్ విషయం. విగ్రహ తయారీలో అవినీతికి పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరు దోషులని తేలినా వారిపై కఠినంగా చర్యలుంటాయి. ” అని వ్యాఖ్యానించారు.
మరోవైపు కూలిపోయిన విగ్రహ ప్రదేశంలో ఇంతకంటే పెద్ద విగ్రహం నెలకొల్పుతామని ఏక్ నాథ్ షిండ్ ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 26న సింధు దుర్గ్ ప్రాంతంలో విగ్రహం కూలిపోయిన ఘటనపై ప్రస్తుతానికి ఇండియన్ నేవీ విచారణ చేస్తోంది. అయితే ఇంతవరకు విగ్రహం కూలిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో తెలియలేదని అధికారులు తెలిపారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడానికి రెండు మూడు రోజుల ముందు భారీ వర్షాలు, జోరుగా గాలివాన వాతావరణం ఉంది.
రాజకీయాలు చేయొద్దు: దేవేంద్ర ఫడ్నవీస్
ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన బిజేపీ తీరు మరోలా ఉంది. శివాజీ మహరాజ్ విగ్రహం తయారీలో అవినీతి జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ.. మహాయుతి కూటమి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర మరో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షా పార్టీల తీరును తప్పుబట్టారు. శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోవడం చాలా దురదృష్టకరమని చెబుతూ.. ఎవరూ ఈ ఘటనని రాజకీయం చేయకూడదని అభిప్రాయపడ్డారు. ”విచారణ జరుగుతోంది. దోషులపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ కమిటీ సీరయస్ గా విచారణ చేస్తోంది. ఇంత కంటే భారీ శివాజీ మహరాజ్ విగ్రహం స్థాపిస్తాం.” అని చెప్పారు.
Also Read: ‘ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేయండి లేకపోతే..’ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు యుపి సిఎం వార్నింగ్..