Islamic Jihad: గాజాలో అల్ అహ్లి అరబ్ ఆస్పత్రిలో పేలుడు ఘటనతో ఒక్కసారిగా పశ్చిమ ఆసియా దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 500 మందిని పొట్టన బెట్టుకున్నది పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) గ్రూప్ అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆరంభమైన అనంతరం తొలిసారి వినిపిస్తున్న పేరు ఇది.
హమాస్తో సంబంధం లేని గ్రూప్గా పీఐజే కనిపిస్తుంటుంది. కానీ రెండు గ్రూపులు పోరాడుతున్నది మాత్రం ఇజ్రాయెల్పైనే. పీఐజే పేల్చిన రాకెట్ విఫలమై ఆస్పత్రిపై పడిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. గాజా కేంద్రంగా పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ పనిచేస్తోంది. గాజాలో రెండో అతి పెద్ద సాయుధ గ్రూప్ ఇదే. గాజాస్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకించే లక్ష్యంతో 1980లో ఏర్పాటైంది.
హమాస్తో సంబంధం లేకుండానే పీఐజే కొన్నిసార్లు స్వతంత్రంగా దాడులు చేస్తుంటుంది. అయితే ఈ రెండు గ్రూపులకు ఆయుధాలు, నిధులను పెద్ద ఎత్తున అందుతున్నది ఇరాన్ నుంచే. పీఐజేను కూడా హమాస్లాగానే ఉగ్రవాద సంస్థగా ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించాయి. హమాస్ క్రియాశీలంగా లేని సమయాల్లో ఇజ్రాయెల్పై ఇస్లామిక్ జిహాద్ దాడులు చేస్తుంటుందని విశ్లేషకులు భావిస్తారు. గతంలో ఇరు గ్రూపులు చేతులు కలిపిన సందర్భాలు లేకపోలేదు.
గాజా ఆస్పత్రి ఘటనకు పీఐజే కారణమని ధ్రువీకరించుకుని, ఆ విషయం వెల్లడించడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) 2 గంటలకుపైగా సమయం తీసుకుంది. బహుళమార్గాల్లో వచ్చిన నిఘా సమాచారం మేరకు పీఐజే పేల్చిన రాకెట్ గురి తప్పిందనే నిర్థారణకు వచ్చామని ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పీఐజే మిలిటెంట్లు బిగ్గరగా చేసిన సంభాషణల తాలూకు ఆడియో రికార్డింగ్లు తమ వద్ద ఉన్నట్టు తెలిపింది.
ఆస్పత్రిలో పేలుడు సంభవించిన సమయంలో తమ త్రివిధ దళాలేవీ రంగంలో లేవని స్పష్టం చేసింది. ఆ సమయంలో మిలటరీ డ్రోన్ రికార్డు చేసిన ఏరియల్ ఫుటేజిని, రాడార్ చిత్రాలను విడుదల చేసింది. అలాగే ఆ సమయంలో మిలిటెంట్ గ్రూపుల మధ్య జరిగిన సంభాషణలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఇంటర్సెప్ట్ చేయగలిగాయి.