Himanta Biswa Sarma Serious on Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. శుక్రవారం ఝార్ఖండ్ లో నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బిశ్వశర్మ మాట్లాడుతూ.. ‘బెంగాల్ రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దిశగా ఆలోచించకుండా సీఎం మమతా బెనర్జీ ఝార్ఖండ్ కు పాఠాలు చెబుతున్నారు. మమతా బెనర్జీ గారు ముందుగా పశ్చిమ బెంగాల్ వరదల గురించి ఆలోచించి, ఆ తరువాత ఝార్ఖండ్ గురించి మాట్లాడితే బాగుంటుంది.
పశ్చిమ బెంగాల్ లో వరదలు రావడానికి కారణం ముమ్మాటికీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. వరదల నేపథ్యంలో సరైన విధంగా స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ, ఝార్ఖండ్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటో అర్థం కావడంలేదు. ఇంతకు మమత తీరును చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. బెంగాల్ వరదలకు ఝార్ఖండ్ రాష్ట్రం కారణం కాదంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ, దీదీజీ ఝార్ఖండ్ తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నారు. అయినా కూడా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మౌనంగా ఎందుకున్నారో అర్థం కావడంలేదు.
Also Read: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు
ఈ అంశం ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినది. అయినా కూడా దీనిపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంటే ఎలా..? ఇటువంటి ప్రభుత్వాలకు మళ్లీ ప్రజలు ఎలా అధికారాన్ని కట్టబెడుతారు.? ఈ విషయంపై ఝార్ఖండ్ ప్రజలే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఇదిలా ఉంటే.. బెంగాల్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ పూర్తిగా మానవ ప్రమేయంతో వచ్చిన వరదలంటూ ఆమె పేర్కొన్నారు. ఈ వరదల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి డీవీసీ డ్యామ్ ల వద్ద డ్రైడ్జింగ్ చేయడంలో విఫలమయ్యిందని, ఈ కారణంగానే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయన్నారు. దీనికి డీవీసీనే బాధ్యత వహించాలన్నారు.
కాగా, బెంగాల్ – ఝార్ఖండ్ సరిహద్దులో పంచేత్, మైథాన్ ల వద్ద డీవీసీ డ్యామ్ లు ఉండగా, డీవీసీ ఈ సంవత్సరం 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్లే ఈ వరదలు వచ్చాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీవీసీతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటామంటూ సీఎం హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో జార్ఖండ్ లో పర్యటించిన బిశ్వశర్మ పై విధంగా పేర్కొన్నారు.