Ayodhya : భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రామమందిర గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేసే విగ్రహం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇప్పటికే మూడు డిజైన్లతో విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూపొందించింది. వీటిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది. మూడు డిజైన్స్లో దేనికి ఎక్కువ ఓట్లు పడితే ఆ విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
ముగ్గురు వేర్వేరు శిల్పులు రూపొందించిన విగ్రహాలను సమావేశంలో ఉంచి అత్యధికులు ఓటేసిన విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న 51 అంగుళాల పొడవైన మూడు విగ్రహాల్లో దైవత్వం ఉట్టిపడేదాన్ని ఎంపిక చేస్తామని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.
ఏడు రోజులపాటు జరిగే రామాలయ పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో ముఖ్యమైన ఘటనల్లో రాముని బిడ్డలాంటి విగ్రహాన్ని మోసే ఊరేగింపు, ఆచార స్నానాలు, పూజలు, హోమాలు ఉంటాయి. జనవరి 22న ఉదయం పూజను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మృగశిర నక్షత్ర అభిజీత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠను నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
శ్రీరామ మందిర్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.