మే 3.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మణిపూర్ లో కల్లోలం రేగింది. తమను ఎస్టీల్లో చేర్చాలని మైతేయిల డిమాండ్కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టారు. ఆ రోజు హింసాకాండ చేలరేగింది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. శాంతిభద్రతల పునరుద్ధరణకు తీవ్రంగా కృషి చేస్తున్నామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా మణిపూర్ మాత్రం ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది.
హింసాత్మక ఘటనలు తగ్గినా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది మృతిచెందారు. వందల మంది గాయపడ్డారు. 60వేల మందికిపైగా తమ నివాసాలను ఖాళీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. విధ్వంస ఘటనలపై 6500 కేసులు నమోదయ్యాయి.
మణిపూర్లో జరిగిన మరో దుశ్చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైన ఉదంతం బయట పడింది. ప్రాణభయంతో తన పిల్లలను తీసుకొని వెళుతున్న ఆ తల్లిపై కీచకలు లైంగికదాడికి పాల్పడ్డారు. 3 నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
37 ఏళ్ల బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఇలా ఉన్నాయి. చురాచాంద్పూర్లోని ఓ గ్రామంలో మే 3న సాయంత్రం 6.30 గంటల సమయంలో కొందరు దుండగులు ఇళ్లను తగులబెట్టారు. దీంతో భయపడిన ఆ మహిళ తన ఇద్దరు పిల్లలు, మరదలు, మరో ఇద్దరు చిన్నారులతో కలిసి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయారు. దుండగులు వెంబండి ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. బాధితరాలు ధైర్యంగా ప్రతిఘటించే ప్రయత్నం చేయగా భౌతిక దాడికి దిగారు. వదిలిపెట్టాలని ప్రాధేయపడినా కనికరించలేదు. వివస్త్రను చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కుటుంబ పరువు పోతుందేమోనని ఇన్నాళ్లూ బయటికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 3 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. జరిగిన విషయాన్ని వైద్యులకు చెప్పారు. బాధితురాలికి డాక్టర్లు ధైర్యం చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.