France : ఫ్రాన్స్లో అల్లర్లు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రొఫెసర్, కార్డియాలజిస్టు ఎన్.జాన్ కామ్ పేరుతో ఉన్న ఖాతా నుంచి చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆ దేశానికి పంపాలని ఆ ట్వీట్ లో ఉంది. యోగి 24 గంటల్లో అల్లర్లను కట్టడి చేయగలరని పేర్కొన్నారు. ఈ ట్వీట్పై యోగి కార్యాలయం కూడా స్పందించింది. ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా యోగి మోడల్ను అనుసరించాలని స్పష్టం చేసింది.
అయితే జాన్ కామ్ ట్విటర్ ఖాతా నకిలీదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఖాతా చీటింగ్ కేసులో అరెస్టైన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ దని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్వీట్పై యోగి కార్యాలయం స్పందించడంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని చురకలు అంటించారు. ట్వీట్ చేసిన వ్యక్తి ట్విటర్ ఖాతా నకిలీదని కూడా గమనించలేదా అని విమర్శించారు.
17 ఏళ్ల యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపిన ఘటనపై ఫ్రాన్స్లో నిరసనలు చెలరేగాయి. పారిస్, మార్సెయిల్, లియాన్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. కార్లు, భవనాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. 4రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మార్సెయిల్లో ఓ తుపాకుల షాపులో ఆయుధాలు ఎత్తుకెళ్లారు. వందల సంఖ్యలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. 45 వేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. అయినా సరే అల్లర్లను కట్టడి చేయలేకపోతున్నారు. 1,311 మంది నిరసనకారులను అరెస్టు చేశామని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది.
ఫ్రెంచ్ గియనాలో తాజాగా 54 ఏళ్ల వ్యక్తి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షుడు మెక్రాన్ జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు నహెల్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు. తన బిడ్డను పోలీసు అధికారి అన్యాయంగా చంపేశారని నహెల్ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.
ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్షుడు మెక్రాన్ మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పారిస్లో బ్రిటిష్ సింగర్ ఎల్టాన్ జాన్ కచేరీకి మెక్రాన్, ఆయన భార్య హాజరయ్యారు. ఆ వీడియోలు చూసి నెటిజన్లు మెక్రాన్ పై తీవ్రంగా మండిపడ్డారు.