వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాస్త్రీయ సర్వే చేసేందుకు ఏఎస్ఐకు అనుమతి ఇచ్చింది. సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. సర్వేపై ముస్లిం పక్షాల చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సర్వే వల్ల మసీదుకు ఎలాంటి నష్టం జరగకూడదని న్యాయస్థానం స్పష్ట చేసింది. వాస్తవాలు బయటకు రావాలంటే సర్వే జరగాల్సిందేనని తేల్చిచెప్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేచేస్తామని ఏఎస్ఐ ఏడీజీ త్రిపాఠి ప్రకటించారు.
మసీదులో ఆర్కియాలజీ సర్వేపై గురువారం వరకు స్టే విధిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలన్న కింది కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే పొడిగించింది. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను జిల్లా కోర్టు ఆదేశించింది. దీనిపై అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేకు తొలుత గురువారం వరకు స్టే విధించింది. తాజాగా మరోసారి వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరోవైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతల చిహ్నాలను పరిరక్షించాలంటూ మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అలహాబాద్ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టుల్లో బుధవారం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సర్వే సమయంలో హిందూ చిహ్నాలకు నష్టం కలగకుండా జ్ఞానవాపి మసీదు ప్రాంగణం మొత్తానికీ సీల్ వేయాలని పిటిషనర్లు కోరారు. మసీదు ప్రాంగణంలోని హిందూ చిహ్నాలను కొందరు ముస్లింలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ మరోవ్యక్తి వారణాసి కోర్టులో కేసు వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.