IIT Bombay student news(Telugu flash news) : ఐఐటీ బాంబే దేశంలో పేరుపొందిన విద్యాసంస్థల్లో ఒకటి. అక్కడ చదువుకున్న విద్యార్థులు భారీ వేతన ప్యాకేజీలతో అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతారు. అలాంటి విద్యాసంస్థ ఇప్పుడు ఓ వివాదానికి కేంద్రంగా మారింది. అక్కడ వెజ్-నాన్వెజ్ వివాదం రాజుకుంది. హాస్టల్ క్యాంటీన్లో మాంసాహారం తిన్న ఓ విద్యార్థిని మరో స్టూడెంట్ అవమానించడంతో వివాదం మొదలైంది. గత వారం హాస్టల్ 12లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తాజాగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
నాన్ వెజ్ తినే విద్యార్థులపై క్యాంటీన్లో వివక్ష చూపుతున్నారని కొంతమంది స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు.. శాఖాహారులను మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అనుమతిస్తామని రాసిన పోస్టర్లను ట్విటర్ లో పోస్టు చేయడం కలకలం రేపింది. క్యాంటీన్ గోడలపై ఈ పోస్టర్లు అతికించారు. నాన్ వెజ్ తినే వారిని అక్కడ కూర్చుంటే బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని బాధిత విద్యార్థులు అంటున్నారు.
బాంబే ఐఐటీ హాస్టల్ క్యాంటీన్ లో వెజ్, నాన్వెజ్పై నిబంధనలు ఏవైనా ఉన్నాయా? అనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు. తినే ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదనే సమాధానం వచ్చింది. ఇది జరిగి 3 నెలలు అయ్యింది. అయినాసరే కొందరు విద్యార్థుల వెజ్-నాన్ వెజ్ ఆధారంగా కూర్చోవాల్సిన చోటును నిర్దేశిస్తున్నారని ఓ స్టూడెంట్ తెలిపాడు. ఇలాంటి ఘటనలు అవమానకరంగా ఉన్నాయని కొందరు విద్యార్థులు ట్వీట్స్ చేశారు. అంబేడ్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ పేరిట ఉన్న ట్విటర్ అకౌంట్ లో ఈ పోస్టులు చేశారు. ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాధానం ప్రకారం ఇన్స్టిట్యూట్లో ఆహార విభజన విధానం లేదని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు.
తాజా వివాదంపై ఐఐటీ అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2018లోనూ బాంబే ఐఐటీలో ఇలాంటి వివాదమే రేగింది. మాంసాహారం తినే విద్యార్థులు విడిగా ప్లేట్లు వాడాలని ఓ సర్కులర్ జారీ చేయడంతో అప్పట్లో కలకలం రేగింది. విజిటేరియన్ విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ వల్లే అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నామని మెస్ కౌన్సిల్ సమాధానం ఇచ్చింది.